హైదరాబాద్: గర్భం దాల్చి..శిశువును కోల్పోయిన పనిమనిషి ఇంటి యజమాని కుమారుడిని కిడ్నాప్ చేసింది. ఈ ఘటన మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గర్భం కోల్పోవడంతో తీవ్ర మానసిక ఆవేదనకు గురై ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో ఆమె అంగీకరించింది. మేడిపల్లి పోలీసులు అప్రమత్తత..వేగవంతమైన దర్యాప్తుతో కిడ్నాప్కి గురైన 8 నెలల బాలుడిని కేవలం 3 గంటల్లోనే సురక్షితంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటనలో బాలుడిని అపహరించిన మహిళను అదుపులోకి తీసుకున్నారు.
ఉప్పల్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ ఎన్ఐఎన్ కాలనీలో నివసించే కొట్టె శివరామ్, స్పందన దంపతుల 8 నెలల కుమారుడు వైష్ణవ్ రుద్రాంశ్ బుధవారం మధ్యాహ్నం కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పనిమనిషిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే మేడిపల్లి పోలీసులు ప్రత్యే క బృందాలు ఏ ర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించడంతో పాటు సాంకేతిక ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల సమాచారాన్ని విశ్లేషించుకొని, దర్యాప్తులో భాగంగా పనిమనిషి నల్లా దుర్గా భవాని అనే మహిళ బాలుడిని తీసుకెళ్లినట్లు గుర్తించారు.
వెంటనే అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని వైద్య పరీక్షల అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ జలేందర్ రెడ్డి, ఎస్ఐ నర్సింగ్రావు తదితరులకు మేడిపల్లి ఏసీపీ మోహన్ కుమార్ రివార్డులు అందజేశారు. కాగా గర్భస్రావమై శిశువు ను కోల్పోయిన ఒత్తిడిలో దుర్గాభవానీ..తన కుటుంబ సభ్యులను నమ్మించేందుకు కిడ్నాప్ చేసినట్లుగా అనుమానిస్తున్నారు. దీనిపై విచారణలో ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పినట్లుగా తెలుస్తోంది.