శ్రీలంకతో ఇవాళ (జులై 20) ముగిసిన తొలి టెస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లంక నిర్ధేశించిన 131 పరుగుల లక్ష్యాన్ని పాక్ 6 వికెట్లు కోల్పోయి చేధించింది. ఇమాముల్ హక్ (50 నాటౌట్).. కెప్టెన్ బాబర్ ఆజమ్ (24), సౌద్ షకీల్ (30)ల సహకారంతో పాక్ను విజయతీరాలకు చేర్చాడు. ఈ విజయంతో పాక్ రెండు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఛేదనలో కీలక ఇన్నింగ్స్ ఆడి, తొలి ఇన్నింగ్స్లో అజేయ డబుల్ సెంచరీతో చెలరేగిన సౌద్ షకీల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఈ విజయం తర్వాత పాక్ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఆ జట్టు ఆటగాళ్లు ఏదో సాధించామన్న రేంజ్లో ఓవరాక్షన్ చేశారు. ఏదో వరల్డ్కప్ గెలిచేసినట్లు ఫీలైపోయారు. వాస్తవానికి గెలుపు ఎవరిపై అయినా, ఎలాంటి పరిస్థితుల్లో సాధించినా, ఎవరు సాధించినా అంగీకరించాల్సిందే. అయితే, ఇక్కడ పాక్ సాధించిన గెలుపుకు అంత ఓవరాక్షన్ అవసరం లేదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
July 20th, 2022 - 146th Test win for Pakistan
July 20th, 2023 - 147th Test win for Pakistan
The wait is over, Pakistan won a Test match after a gap of 365 days. pic.twitter.com/RrDQ9lPjWt— Johns. (@CricCrazyJohns) July 20, 2023
ఎందుకంటే, ఆ జట్టు 365 రోజుల్లో సాధించిన ఏకైక విజయం ఇది. ఈ మధ్యలో ఆ జట్టు పదుల సంఖ్యలో టెస్ట్ మ్యాచ్లు ఆడినా ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేకపోయింది. సరిగా ఇదే రోజున (జులై 20) 2022లో ఆ జట్టు చివరిసారిగా ఓ టెస్ట్ మ్యాచ్లో గెలిచింది. ఈ విషయం తెలిసే కొందరు నెటిజన్లు పాక్ ఆటగాళ్లపై దుమ్మెత్తిపోస్తున్నారు.
ఏడాదిలో ఒక్క విజయం సాధించినందుకు ఇంత సంబరం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ఏడాదిగా తమ ప్రదర్శనను చూసి సిగ్గు పడాల్సింది పోయి, ఏదో సాధించామన్నట్లు ఓవరాక్షన్ ఎందుకని నిలదీస్తున్నారు. ఇంకొందరైతే.. ఏడాది తర్వాత సాధించిన విజయం కాబట్టి ఆ మాత్రం ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సౌద్ షకీల్ పుణ్యమా అని పాక్కు సరిగ్గా ఏడాది తర్వాత తొలి విజయం లభించింది.