టీమిండియా పేస్ బాద్షా మొహమ్మద్ షమీ ఇవాళ (జనవరి 9) దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకున్నాడు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ క్రీడా అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా షమీ ప్రతిష్టాత్మక అవార్డుచే సత్కరించబడ్డాడు. వన్డే వరల్డ్కప్ 2023లో అద్భుత ప్రదర్శన (7 మ్యాచ్ల్లో 3 ఐదు వికెట్ల ఘనతలతో 24 వికెట్లు) కారణంగా షమీ అర్జున్ అవార్డుకు ఎంపికయ్యాడు.
A proud day for cricket...!!!
Shami is now a Arjuna Awardee. 🫡pic.twitter.com/A8NDBqcjt1— Mufaddal Vohra (@mufaddal_vohra) January 9, 2024
షమీతో పాటు వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 26 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులు లభించాయి. గతేడాది బ్యాడ్మింటన్లో అత్యుత్తమంగా రాణించిన చిరాగ్ చంద్రశేఖర్ షెట్టి, రాంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్లకు మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డులు దక్కాయి. షమీకి ముందు ప్రస్తుత భారత క్రికెటర్లు శిఖర్ ధవన్ (2021), రవీంద్ర జడేజా (2019), రోహిత్ శర్మ (2015), రవిచంద్రన్ అశ్విన్ (2014), విరాట్ కోహ్లి (2013) అర్జున అవార్డులు గెలుచుకున్నారు.
ఇదిలా ఉంటే, వరల్డ్కప్ అనంతరం షమీ గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. త్వరలో ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే టీ20 సిరీస్కు సైతం అతను దూరంగా ఉన్నాడు. ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ సమయానికి షమీ ఫిట్గా ఉంటాడని తెలుస్తుంది. 33 ఏళ్ల షమీ టీమిండియా తరఫున 64 టెస్ట్లు, 101 వన్డేలు, 23 టీ20లు ఆడి 448 వికెట్లు పడగొట్టాడు. షమీ ఖాతాలో రెండు టెస్ట్ అర్ధసెంచరీలు కూడా ఉన్నాయి. షమీకి ఐపీఎల్లో సైతం ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ.. తన ఐపీఎల్ కెరీర్లో 110 మ్యాచ్లు ఆడి 127 వికెట్లు పడగొట్టాడు.