Malkajgiri Lok Sabha: మల్కాజిగిరి మాదే... | Sakshi
Sakshi News home page

Malkajgiri Lok Sabha: మల్కాజిగిరి మాదే...

Published Sat, May 4 2024 9:08 AM

Patnam Sunitha Mahender Reddy Exclusive Interview

హైదరాబాద్:  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిట్టింగ్‌ స్థానం.. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఈటల రాజేందర్‌ .. అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ విజయం.. ఇలా విభిన్నమైన రాజకీయ సమీకరణాలతో అందరి దృష్టి ఆకర్షిస్తోంది మల్కాజిగిరిలోక్ సభ   నియోజకవర్గం. ఎంతో మంది రాజకీయ నాయకుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసిన చోట జిల్లాపరిషత్‌ ఎన్నికల్లో హ్యాట్రిక్‌ విజయాలు సాధించిన పట్నం సునీతా మహేందర్‌ రెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు..  

సీఎం రేవంత్‌రెడ్డి సిట్టింగ్‌ స్థానం నుంచి పోటీచేయడానికి అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. మరో మారు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలని సీఎం చాలెంజ్‌గా తీసుకున్నారు. గతంలో ఆయన విజయానికి పనిచేసిన నేతలు, కేడర్‌ అంతా కలిసికట్టుగా ఏకతాటిపై పనిచేస్తున్నారు. తెలంగాణ సమాజం రేవంత్‌రెడ్డిని గట్టిగా నమ్ముతోంది.  

సానుకూల వాతావరణం ఉంది.. 
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పదేళ్ల పాటు జిల్లాపరిషత్‌ అధ్యక్షురాలిగా పనిచేశాను. ప్రతి మండలం, గ్రామ స్థాయిలో పారీ్టలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలల అభివృద్ధికి  నిధులు అందించాను. ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు, నాయకులు బ్రహ్మరథం పడుతున్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా పారీ్టలో చేరుతున్నారు. తోటి మహిళను గెలిపించుకుంటామని మహిళలంతా స్వతహాగా ముందుకొస్తున్నారు.  

స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.. 
పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉంది.  మహేశ్వరం, ఎగువ  ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే ఎల్‌బీ నగర్‌ నియోజకవర్గంలో నివాస గృహాలు మునిగిపోతున్నాయి. తక్షణం వరద సమస్య పరిష్కరించడానికి సీఎం సానుకూలంగా ఉన్నారు. ఉప్పల్, మేడ్చల్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి నియోజకవర్గాలో ట్రాఫిక్, ఇతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మూసీ పరివాహక ప్రాంతంలో శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మల్కాజిగిరి నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టో తయారు చేశాం.  

ఆ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం.. 
బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య చీకటి ఒప్పందం నడుస్తోంది. మాజీ మంత్రి మల్లారెడ్డి బీజేపీ అభ్యర్థి రాజేందర్‌ మ«ధ్య జరిగిన సంభాషణే ఇందుకు సాక్ష్యం. బయట ఎన్ని మాటలు మాట్లాడినా లోలోపల వాళ్లంతా ఒక్కటే.  ఎన్నికల సమయంలో పరస్పర అవగాహనతోనే ముందుకెళుతున్నారు.

మోసపూరిత వాగ్దానాలను ప్రజలు నమ్మరు.. 
ఎన్నికలు అనగానే రాజకీయ పారీ్టలు రకాల హామీలతో ప్రజల ముందుకొస్తారు. గతంలో ఈ ప్రాంతంలో వరదలు వచ్చినపుడు అప్పటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండిపోతే బండి ఇస్తామన్నారు. ఒక్కరినీ ఆదుకున్న పాపాన పోలేదు.  ఇలాంటివి ఎన్నో హామీలు గాలికి వదిలేశారు. అందుకే ఈ సారి బీజేపీని నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. ఈటల రాజేందర్‌ ఇక్కడి ప్రజలకు కొత్త. స్థానిక సమస్యలపై ఆయనకు అవగాహన లేదు. బీఆర్‌ఎస్‌ పట్ల ప్రజల్లో నమ్మకం పోయింది. అందుకే ఆ పార్టీ తరపున పోటీ చేయడానికే ఎవరూ ముందుకు రాలేదు.

ఉప్పల్, ఎల్‌బీ నగర్‌లో ఐటీ అభివృద్ధి చేస్తాం. 
ఉప్పల్, ఎల్‌బీ నగర్‌ ప్రాంతాల్లో ఐటీ అభివృద్ధి చేస్తాం. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో జేఈఈ, నీట్, క్యాట్‌ శిక్షణ తగతులు ఏర్పాటు చేస్తాం. మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాల కల్పనకు తగిన చర్యలు తీసుకుంటాం. ట్రాఫిక్‌ ఇబ్బందులు తీర్చేందుకు పై వంతెనలు (ఫ్లై ఓవర్‌ బ్రిడ్జ్‌) నిర్మాణం, అంతర్గత రహదారులు,  కాలుష్య నివారణకు తగిన చర్యలు తీసుకోవడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తాం.  
 

Advertisement
 
Advertisement