సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెన్షన్లతో సహా ఇతర అన్ని సంక్షేమ పథకాల నగదు పంపిణీ విధుల నుంచి వలంటీర్లను దూరంగా ఉంచాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఆదేశాలను జారీచేసింది. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పదేపదే చేసిన ఫిర్యాదులకు తోడు.. అదే సంస్థ హైకోర్టులో వేసిన కేసు, వలంటీర్లకు వ్యతిరేకంగా పదేపదే వివిధ దినపత్రికల్లో వస్తున్న కథనాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలను జారీచేస్తున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొంది.
అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి సంక్షేమ పథకం కిందైనా నేరుగా నగదును ఇచ్చే విధుల నుంచి వలంటీర్లను తొలగించాలని స్పష్టంచేసింది. అదే విధంగా వలంటీర్లకు ఇచ్చిన సెల్ఫోన్లు, ట్యాబ్లు వంటి ఇతర పరికరాలని్నంటినీ కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి పూర్తయ్యే వరకు డీఈఓకి అప్పజెప్పాల్సిందిగా ఆదేశించింది. ఇక పెన్షన్లు వంటి సంక్షేమ పథకాల నగదు పంపిణీ కోసం రెగ్యులర్ ఉద్యోగుల ద్వారా ఇప్పటికే రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలకు వినియోగిస్తున్న ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) వంటి ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల సంఘం కోరింది.
