‘ప్రియాంక గాంధీ కాంగ్రెస్‌కు రెబల్‌గా మారనుంది’ | Sakshi
Sakshi News home page

‘ప్రియాంక గాంధీ కాంగ్రెస్‌కు రెబల్‌గా మారనుంది’

Published Sat, May 4 2024 11:03 AM

BJP says Rahul Gandhi camp marginalising Robert Vadra Priyanka Gandhi

లోక్‌సభ ఎ‍న్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లోని రెండు కాంగ్రెస్ కంచుకోట స్థానాలైన ఆమేథీ, రాయ్‌బరేలీలో అభ్యర్థులను శుక్రవారం ప్రకటించటంతో సస్పెన్షన్‌ వీడింది.  ఆమేథీలో కిషోరీ లాల్‌ శర్మ, రాయ్‌ బరేలీలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని  పార్టీ అధిష్టానం బరిలోకి దించటంతో వారు నామినేషన్‌ దాఖలు చేశారు. 

ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఆమేథీ స్థానం విషయంలో బీజేపీ.. రాహుల్‌ గాంధీ క్యాంప్‌పై తీవ్ర విమర్శలు చేస్తోంది. రాహుల్‌ గాంధీ క్యాంప్‌..  ప్రియాంకా గాంధీ, ఆమె భర్త రాబర్ట్‌ వాద్రాలను కావాలనే కాంగ్రెస్‌ పార్టీకి దూరం చేసిందని బీజేపీ ఆరోపణలు చేస్తోంది.

‘ఆమేథీలో ఎంతో ప్రజాదరణ ఉన్న రాబర్ట్‌ వాద్రాను ఆ స్థానం నుంచి కావాలనే పక్కకు తప్పించారు. ఇది ఖచ్చితంగా రాహుల్‌ గాంధీ క్యాంప్‌ చేసిన పనే. తర్వలో ప్రియాంకా గాంధీ, ఆమె భర్త రాబర్ట్‌ వాద్రా కాంగ్రెస్ నాయకత్వానికి రెబల్‌గా మారుతారు’ అని బీజేపీ నేత అమిత్ మాల్వియా ‘ఎక్స్‌’ వేదికగా అన్నారు.

ఇటీవల రాబర్ట్‌ వాద్రా తనకు ఆమేథీలో ప్రజాధారణ ఉందని పేర్కొన్నారు.   అదీ కాక.. తాను క్రియాశీల రాజకీయాల్లో​కి రావాలని దేశంలో కోరుకుంటోందని తెలిపారు. తాను మార్పు తీసుకురాగలనని కాంగ్రెస్‌ భావిస్తే.. రాజకీయాల్లోకి వస్తాను. తాను ఆమేథీలోనే పోటీ చేయాలని లేదు.. మొరాదాబాద్‌, హర్యానాలో కూడా పోటీ చేస్తానన్నారు. ఇక.. రాబర్ట్‌ వాద్రా వ్యాఖ్యలతో ఆయన కాంగ్రెస్‌ కంచుకోట స్థానమైన ఆమేథీ సీటు ఆశించినట్లు పరోక్షంగా వెల్లడి అయింది.

మూడు పర్యాయాలు రాహుల్‌గాంధీ ఆమేథీ స్థానంలో అనూహ్యంగా 2019లో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే మరో నియోజకవర్గంలో కేరళలోని వాయ్‌నాడ్‌లో గెలుపొందిన విషయం తెలిసిందే.  2019లో రాయ్‌బరేలీలో విజయం సాధించిన సోనియా గాంధీ రాజ్యసభకు ఎంపిక కావటంతో ఆ స్థానంలో అనేక సంప్రదింపుల అనంతరం రాహుల్‌ గాంధీ బరిలోకి దిగారు.

Advertisement
Advertisement