న్యూఢిల్లీ: సీనియర్ ఐఏఎస్ అధికారి గోవింద్ మోహన్ తదుపరి కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా ఉన్న గోవింద్ మోహన్ను అజయ్కుమార్ భల్లా స్థానంలో హోంశాఖ కార్యదర్శిగా నియమిస్తూ కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుందని ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. ఈనెల 22న అజయ్కుమార్ పదవీ విరమణ చేయనున్నారు. అదేరోజు గోవింద్ మోహన్ బాధ్యతలు చేపడతారు.
నళిన్ ప్రభాత్ పదవీకాలం కుదింపు
నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్గా నళిన్ ప్రభాత్ పదవీకాలం 2028 ఆగస్టు 31 ఉండగా కేంద్రం అర్ధంతరంగా కుదించింది. ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన నళిన్ను డిప్యుటేషన్పై ఏజీఎంయూటీ కేడర్కు మార్చింది. ఈ మేరకు కేబినెట్ నియామకాల కమిటీ బుధవారం ఆదేశాలు జారీచేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేదాకా లేదా మూడేళ్లపాటు నళిన్ ఏజీఎంయూటీ కేడర్లో డిప్యుటేషన్పై కొనసాగుతారని వివరించింది. అరుణాచల్ ప్రదేశ్– గోవా– మిజోరం– కేంద్ర పాలిత ప్రాంతాలను కలిసి ఏజీఎంయూటీ కేడర్గా పిలుస్తారు. ఇది కేంద్ర హోంశాఖ నియంత్రణలో ఉంటుంది. ప్రభాత్కు కేంద్రం కొత్త బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.
ADVERTISEMENT
ADVERTISEMENT