ఢిల్లీ: రెండు విడతల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు తేదీలు ఖరారయ్యాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత, మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 31న పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఫిబ్రవరి 1న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.
ఫిబ్రవరి 5న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, బడ్జెట్లో ఢిల్లీ కేంద్రంగా ఎలాంటి ప్రకటనలు చేయకూడదని.. ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఏడాది చివరలో బీహార్ ఎన్నికలు జరగనున్నందున, రెండు మిత్రపక్షాలు జనతాదళ్ (యునైటెడ్), లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) రెండూ రాష్ట్రానికి కీలకమైన ప్రకటనల కోసం ఆశిస్తున్నాయి.
బడ్జెట్పై ఆశలు పెట్టుకున్న వేతన జీవులు, రైతులు, కార్మికులు.. కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెబుతుందని ఎదురుచూస్తున్నారు. ఇన్ కమ్ ట్యాక్స్ పరిమితి పరిధిని కూడా కేంద్ర ప్రభుత్వం పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రూ.7లక్షలుగా ఉన్న ఆదాయ పన్ను పరిమితిని రూ. రూ.9 లక్షలకు పెంచనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
ఇదీ చదవండి: రష్యా-ఉక్రెయిన్ వార్: 16 మంది భారతీయులు మిస్సింగ్, 12 మంది మృతి