సాక్షి, ఢిల్లీ: ఈ20 పెట్రోల్కు వ్యతిరేకంగా ఆప్ నేతలు చేపట్టిన ఛలో ప్రధాని నివాస్ ర్యాలీని ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపైనే భైటాయించిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్లు.. ఇథనాల్ ఇంధనానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ20 పెట్రోల్కు వ్యతిరేకంగా ఆప్ రెండు లక్షలకు పైగా సంతకాల సేకరణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి ర్యాలీగా వెళ్లి.. ఆయనకు ఆ ప్రతిని అప్పగించాలని కేజ్రీవాల్ భావించారు. అయితే.. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే భైఠాయించి నిరసన తెలుపుతున్నారు.
ఈ సందర్భంగా మాజీ సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘‘ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి లోనుకావద్దు. అమెరికా నుంచి ఎథనాల్ కొనుగోళ్లను నిలిపివేయాలి. దేశంలో E20 పెట్రోల్ విధానాన్ని బలవంతంగా అమలు చేయొద్దు. ఈ అంశంపై ప్రధానిని కలిసే విషయమై లేఖలు పంపాం. సమస్య పరిష్కారం అయ్యే వరకు మా పోరాటం కొనసాగుతుంది’’ అని స్పష్టం చేశారు.
#WATCH | Delhi: AAP National Convenor Arvind Kejriwal says, "I want to say that PM Modi should not come under pressure from US President Trump. He should stop buying ethanol from the USA and stop imposing E20 on our country. I hope that the Prime Minister will call us. We have… https://t.co/HCiUUO0dW0 pic.twitter.com/xCNkecugvT
— ANI (@ANI) August 4, 2026
ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకం వల్ల వాహనాల ఇంజిన్ సామర్థ్యం పాడవుతుందని వాదిస్తున్న కేజ్రీవాల్.. ప్రజలకు ఇంధనం వేసుకునే సమయంలో ప్యూర్ పెట్రోల్, ఇథనాల్ పెట్రోల్ అనే రెండు ఆప్షన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలోనే.. ఈ అంశంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని అంటున్నారాయన.
"కొన్ని రోజుల క్రితం ప్రధానికి ఉద్దేశించి ఆన్లైన్ వినతిపత్రం ప్రారంభించాం. చాలా తక్కువ సమయంలోనే సుమారు 2,33,238 మంది దానిపై సంతకం చేశారు. నా కార్యాలయం నుంచి అరెస్టులంటే భయపడని 100 మందితో కలిసి ప్రధాని నివాసానికి బయలుదేరుతాను. ఈ వినతిపత్రాన్ని ఆయనకు స్వయంగా అందించి, ఇథనాల్ విధానంలో ఉన్న లోపాల గురించి చర్చించాలని కోరతాం" అని కేజ్రీవాల్ ఇంతకు ముందే ప్రకటించారు.