తిరువనంతపురం: కేరళ సీఎం పినరయి విజయన్పై ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం తనపై భౌతిక దాడి చేయించి గాయపరిచేందుకు కుట్ర పన్నారన్నారు. ఢిల్లీ వెళ్లేందుకుగాను తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు వెళ్తున్న గవర్నర్ వాహనాన్ని ఎస్ఎఫ్ఐ కార్యకర్తల వాహనాలు ఢీ కొన్నాయి. ఎయిర్పోర్టుకు చేరుకున్న అనంతరం కోపంగా కారు నుంచి బయటికి వచ్చిన గవర్నర్ ఈ ఘటన వెనుక సీఎం విజయన్ కుట్ర ఉందని ఆరోపించడం సంచలనం రేపింది.
‘ఒకవేళ సీఎం కాన్వాయ్ వెళ్తుంటే మధ్యలో వేరే వాళ్ల కార్లు రావడానికైనా అనుమతిస్తారా..? సీఎం కారు సమీపంలోకి మరో కారును రానిస్తారా..? కానీ నా విషయంలో ఏం జరిగింది..? ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు నా కాన్వాయ్ వెళ్లే దారిలో కారల్లో వచ్చి నల్ల జెండాలు ప్రదర్శించారు. నా కారును ఇరువైపుల నుంచి వారి కార్లతో ఢీ కొట్టారు.
ఇదంతా జరుగుతుండగా పోలీసులు వారిని కార్లలోపలికి నెట్టారు. దీంతో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు అక్కడి నుంచి పారిపోయారు. ఇది చేయించింది కచ్చితంగా సీఎం విజయనే. గూండాలను పంపి నాపై దాడికి కుట్ర పన్నారు. తిరువనంతపరం రోడ్లు గుండాల ఆధీనంలోకి వెళ్లాయి. ఒకవేళ సీఎం నాతో విభేదించాలనుకుంటే విభేదించవచ్చు.నాపై దాడి చేయాల్సిన అవసరం లేదు. కేరళలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలాయి’ అని గవర్నర్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.