భోపాల్: బాధ్యతగల ఉపాధ్యాయ వృత్తిలో ఉండి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సింది పోయి బడి ఆవరణను శుభ్రం చేయమని పిల్లలకు చెప్పి తాను మాత్రం స్కూలు బ్యాగ్ ను తలదిండుగా చేసుకుని కునుకు తీశాడో ప్రధానోపాధ్యాయుడు.
మధ్యప్రదేశ్ చత్తార్ పూర్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ఆదమరచి నిద్రిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లవకుశ నగర్ ప్రాధమిక పాఠశాలలో రాజేష్ కుమార్ అడ్జారియా హెడ్ మాస్టర్ గా పని చేస్తున్నారు. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన సమయంలో బయట ఆవరణ శుభ్రం చేయమని చెప్పి వారి చేతికి చీపుర్లు ఇచ్చాడు. ఈ విరామంలో ప్రధానోపాధ్యాయుడు పిల్లల స్కూలు బ్యాగులను తలకింద దిండుగా పెట్టుకుని ఎంచక్కా సేదదీరాడు.
ఆడపిల్లలు స్కూలు మొత్తాన్ని శుభ్రం చేస్తుండగా మగపిల్లలు మాత్రం ఆడుకంటూ ఉన్నారు. స్థానికులు ఈ విషయాన్ని గమనించి చోద్యం మొత్తాన్ని సెల్ ఫోన్లో చిత్రీకరించారు. ఈ వీడియో ఒక చరవాణి నుండి మరోదానికి చేతులు మారుతూ పాఠశాలలో చదువుతున్న పిల్లల బంధువుల చేతికి చేరింది.
ఇంకేముంది వారు పిల్లల తల్లిదండ్రులకి విషయాన్ని తెలియజేశారు. బాగుపడుతుందనుకున్న తమ బిడ్డల జీవితం ఇలాంటి అధ్యాపకుల చేతిలో పడితే అంతే సంగతులని భావించి తలిదండ్రులు పై అధికారులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే ఆ ప్రధానోపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోమని డిమాండ్ చేశారు.
Caught on camera: #MadhyaPradesh school headmaster takes a nap in classroom while students clean the floor. #viral
Watch: https://t.co/dAOjb2JoMT pic.twitter.com/b1Ka8JWnMX— editorji (@editorji) July 15, 2023
ఇది కూడా చదవండి: మంత్రి ఆకస్మిక తనిఖీ.. ఫుల్లుగా తాగి పడుకున్న పంచాయతీ కార్యదర్శి