న్యూఢిల్లీ: అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియమితులయ్యారు. ఆలయ విరాళాల నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ట్రస్ట్ పాలకమండలి పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. మొత్తం 5,585 దరఖాస్తులను పరిశీలించిన ఉన్నత స్థాయి కమిటీ ముగ్గురి పేర్లను ఖరారు చేయగా, ట్రస్ట్ సమావేశంలో జితేంద్ర మిశ్రా పేరును ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం గత ఏడాది పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్బేస్లో ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన కలిసి ఉన్న పాత వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతోంది.
ఉత్తరప్రదేశ్ డియోరియా జిల్లాకు చెందిన జితేంద్ర మిశ్రా భారత వాయుసేన వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ చీఫ్గా సేవలందించారు. ‘ఆపరేషన్ సిందూర్’ వ్యూహరచనలో కీలకపాత్ర పోషించిన ఆయనకు సర్వోత్తమ్ యుద్ధ సేవా మెడల్ లభించింది. 43 ఏళ్లపాటు వైమానిక దళంలో దేశసేవ చేసిన తనకు, శ్రీరామచంద్రుడికి, భక్తులకు సేవలందించే గొప్ప అవకాశం దక్కడం పూర్వజన్మ సుకృతమని మిశ్రా పేర్కొన్నారు.
నూతన సీఈవో నియామకంతో పాటు పాలకమండలిలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు కోశాధికారిగా ఉన్న గోవింద్ దేవ్ గిరిని ప్రధాన కార్యదర్శిగా, ఆయన స్థానంలో మహేష్ భాగ్ చంద్ కాను నూతన కోశాధికారిగా నియమించారు. అలాగే మదన్ మోహన్ పాండే, మహేష్ భాగ్ చంద్ కా, డాక్టర్ నిర్మలా యాదవ్లు కొత్త ట్రస్టీలుగా బాధ్యతలు స్వీకరించారు. ట్రస్ట్లో మహిళకు ప్రాతినిధ్యం కల్పించడం ఇదే తొలిసారి.