ఉత్తరప్రదేశ్ గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ గత ఏప్రిల్లో హత్యకు గురైన విషయం విదితమే. కాగా ప్రభుత్వం అతని నుంచి స్వాధీనం చేసుకున్న భూమిలో పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఈ ఇళ్లను లాటరీ ద్వారా అర్హులకు కేటాయించారు.
ప్రయాగ్రాజ్: గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నేతగా ఎదిగిన అతీక్ అహ్మద్ నుంచి స్వాధీనం చేసుకున్న భూమిలో పేదల కోసం నిర్మించిన 76 ఫ్లాట్ల కేటాయింపునకు సంబంధించి లాటరీ తీశారు. ఇది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగింది. ఈ లాటరీలో ఎన్నికైనవారికి ఫ్లాట్లను అప్పగించనున్నారు.
ప్రయాగ్రాజ్ డెవలప్మెంట్ ఆథారిటీ(పీడీఏ) ఉపాధ్యక్షుడు అరవింద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అలహాబాద్ మెడికల్ అసోసియేషన్కు చెందిన హాలులో పేదలకు ఫ్లాట్లను కేటాయించేందుకు లాటరీ తీశామన్నారు. మొత్తం దరఖాస్తు చేసుకున్న 6,030 మందిలో నుంచి 1590 మందిని లాటరీలో పాల్గొనేందుకు అర్హులుగా గుర్తించామన్నారు. లబ్ధిదారులకు 41 స్క్వేర్ మీటర్లలో నిర్మితమైన ఫ్లాట్ రూ. 3 లక్షల 50 వేలకు అందజేయనున్నామన్నారు.
2021లో శంకుస్థాపన
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రెండు గదులు కలిగిన ఈ ఫ్లాట్లో ఒక వంటగది, టాయిలెట్ ఉంటుందన్నారు. ఈ ఫ్లాట్ ఖరీదు రూ. 6 లక్షల రూపాయలని తెలిపారు. ప్రయాగ్రాజ్లోని లూకర్గంజ్ పరిధిలోని అతీక్ నుంచి స్వాధీనం చేసుకున్న 1731 స్క్యేర్ మీటర్ల భూమిలో సరసమైన గృహ నిర్మాణ ప్రాజెక్టుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2021 డిసెంబరు 26న శంకుస్థాపన చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై)కింద ఈ ప్రాజెక్టు చేపట్టింది.
చదవండి: మహారాష్ట్ర రాజకీయంలో కలకలం
UP: Flats built on land confiscated from slain gangster Atiq Ahmed allotted to poor in Prayagraj
Read @ANI Story | https://t.co/VwutaCV8NN#Prayagraj #atiqahmad #UttarPradesh pic.twitter.com/y0fCo4mhGn— ANI Digital (@ani_digital) June 9, 2023
ముఖ్యమంత్రి యోగి చేతుల మీదుగా..
ఈ ప్రాంతంలో రెండు బ్లాకులుగా మొత్తం 76 ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణం పూర్తయ్యాక ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అర్హులైన పేదలకు ఈ ఇళ్లను అప్పగించనున్నారు. అతీక్ అహ్మద్ 2005లో జరిగిన బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే రాజూపాల్ హత్య, ఈ కేసులో ప్రత్యక్ష్య సాక్షి ఉమేష్ పాల్ హత్య కేసులలో ప్రధాన నిందితుడు. కాగా అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్లను ఈ ఏడాది ఏప్రిల్ 15న రాత్రి విలేకరుల రూపంలో వచ్చిన ఆగంతకులు తుపాకీతో కాల్చి చంపారు. అతీక్ అహ్మద్ను పోలీసులు వైద్య పరీక్షల కోసం తీసుకెళుతుండగా ఈ ఘటన జరిగింది.