ఢిల్లీ: దేశ రాజధానిలో చలి బెంబేలెత్తిస్తోంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్కు పడిపోవడంతో విపరీతంగా చలి పెరుగుతోంది. దీనికితోడు పొగమంచు దట్టంగా వ్యాపిస్తోంది. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఉత్తరాఖండ్లలోనూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ఉత్తర భారతదేశమంతటా చలిగాలులు వీస్తున్నాయి.
#WATCH | Dense fog covers parts of national capital as cold wave continues.
(Visuals from Dhaula Kuan area, shot at 6:15 am) pic.twitter.com/MneDB9QmJC— ANI (@ANI) December 27, 2023
పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తర మధ్యప్రదేశ్లో పొగమంచు ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు చూపించే ఉపగ్రహ చిత్రాన్ని కూడా వాతావరణ శాఖ విడుదల చేసింది. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలోని సఫర్జంగ్లో 50 మీటర్లకు దృశ్యమానత పడిపోయింది. పంజాబ్లోని అమృత్సర్ విమానాశ్రయంలో విజిబిలిటీ 0కి పడిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దడ పుట్టిస్తున్న చలి
చలి తీవ్రత పెరగడంతో రాజధాని వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంట్లో నుంచి బయటకు రావడానికి భయపడిపోతున్నారు. అత్యవసరమైన పనులపై బయటికి వెళ్లేవారు మాత్రమే బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చలి తవ్రత పెరిగిన కారణంగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని.. జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
110 విమాన రాకపోకలకు అంతరాయం
పొగమంచు కమ్ముకోవడంతో ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎయిర్పోర్టులో దృశ్యమానత(విజిబిలిటీ) దాదాపు సున్నాకి పడిపోయింది. ఉదయం 10 గంటలకు కూడా రహదారులన్నీ పొగమంచుతో కమ్ముకున్నాయి.

'దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో 110 విమాన రాకపోకలకు ఆలస్యం అవుతోంది' అని ఢిల్లీ ఎయిర్పోర్టు అథారిటీ పేర్కొంది. పొగమంచు కారణంగా ఢిల్లీలోని 25 రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి.

తెలుగురాష్ట్రాలను కప్పేసిన మంచు
తెలుగురాష్ట్రాలను కూడా పొగమంచు దుప్పటి కప్పేసింది. ఉదయం 8 గంటలు అయినా పొగమంచు వీడటం లేదు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. అటు.. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరిగిపోతోంది. రోడ్లు కనపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ చదవండి: ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీకి బాంబు బెదిరింపులు