న్యూడిల్లి: అయోధ్యలోని భవ్య రామ మందిరం వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే అంతకంటే ముందే అయోధ్యలో ఎయిర్పోర్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే విమానశ్రయం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అంతా సజావుగా సాగితే ఈ ఏడాది డిసెంబరులోనే ఇక్కడి నుండి రాకపోకలు మొదలయ్యే అవకాశముందని చెబుతోంది సివిల్ ఏవియేషన్ శాఖ.
బ్లూప్రింట్ విడుదల..
అయోధ్య రామ మందిరం ప్రారంభానికి ముందు.. డిసెంబరులోనే ఇక్కడి ఎయిర్పోర్టు సేవల అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మర్యాద పురుషోత్తమ శ్రీరామ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా పిలవబడే.. ఈ పోర్టు విస్తీర్ణంలో కూడా ఇప్పుడున్న ఎయిర్పోర్టుకి ఐదు రేట్లు పెద్దదిగా ఉండబోతోందని విమానయాన శాఖ అధికారులు విడుదల చేసిన బ్లూప్రింట్లో స్పష్టమవుతోంది.
హైదరాబాద్కు సేవలు?
ఇప్పటికే మొదటి దశ నిర్మాణ పనులు పూర్తయ్యాయని మొదటిగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు హైదరాబాద్ నగరాలకు విమాన సేవలు ప్రారంభమవుతాయని స్పష్టం చేశాయి అయోధ్య ఎయిర్పోర్టు వర్గాలు. ఇదిలా ఉండగా ప్రస్తుతమున్న ఎయిర్పోర్టులో టెర్మినల్ బిల్డింగ్ విస్తీర్ణం 6520 చ.మీటర్లు కాగా బిజీ సమయాల్లో కనీసం 500 మంది ప్యాసింజర్ల వరకు సౌకర్యవంతంగా ఉండేలా దీనిని నిర్మించారు.ఇక 2200 మీటర్ల పొడవైన రన్వే కలిగిన ఈ విమానాశ్రయంలో ఒకేసారి నాలుగు విమానాలను నిలిపే సామర్ధ్యముంది.
రెండో దశ నిర్మాణంలో..
బ్లూప్రింట్ ఆధారంగా చూస్తే రెండో దశలో నిర్మించబోయే ఎయిర్పోర్టులో భారీ ప్రమాణాలతో కూడిన మరిన్ని సౌకర్యాలు కొలువు తీరబోతున్నట్లు తెలుస్తోంది. 30,000 చ.మీటర్ల విస్తీర్ణంలో నిర్మించబోయే నూతన టెర్మినల్ భవనం బిజీ సమయాల్లో కనీసం 3200 మంది ప్రయాణికులకు సౌకర్యం కల్పించనున్నారు. ఇక దీనికి 2200 నుండి 3125 మీటర్ల వరకు రన్ వేను ఎక్స్టెండ్ చేయనున్నారు. రెండో దశలో నిర్మించబోయే టెర్మినల్ వద్ద కనీసం ఎనిమిది ఏ-321 విమానాలను పార్క్ చేయవచ్చని బ్లూప్రింట్లో స్పష్టమవుతోంది.
ప్రారంభోత్సవం ఎప్పుడంటే..
రామమందిరం నిర్మాణం పూర్తికాక ముందే ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిన నేపథ్యంలో మందిరం నిర్మాణం పూర్తయ్యేసరికి భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశముండటంతో రెండో టెర్మినల్ నిర్మాణం ఆవశ్యమని అందుకే దీని నిర్మాణం త్వరితగతిన పూర్తిచేశామని ఈ విమానాశ్రయం భక్తులకు గేట్వేగా వ్యవహరించనుంది తెలిపింది కేంద్ర విమానయాన శాఖ. శరవేగంగా నిర్మాణ పనులను పూర్తి చేసుకుంటున్న ఈ రామ మందిరం ప్రారంభోత్సవం వచ్చే ఏడాది జనవరి 22-24 మధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది.
#Ayodhya Airport New Terminal construction progress.
PC-Ayodhya Story pic.twitter.com/1z4HTrJn0E— Chandrashekhar Dhage (@cbdhage) September 11, 2023
ఇది కూడా చదవండి: గణేష్ మండపంలో బుర్ఖాతో డ్యాన్సులు.. అరెస్టు