ఢిల్లీ, సాక్షి: ఢిల్లీ ఛలో పేరిట ఆందోళనలను తీవ్రతరం చేయాలని రైతు సంఘాలు భావిస్తున్న తరుణంలో కేంద్రం స్పందించింది. మరోసారి చర్చలకు రావాలని రైతు సంఘాల్ని ఆహ్వానించింది. తమతో కేంద్రం అవలంభిస్తున్న వైఖరికి నిరసనగా.. ఈ నెల 16వ తేదీన భారత్ బంద్కు కిసాన్ మోర్చా పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే..
భారత్ బంద్ ప్రకటించిన కాసేపటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా మీడియాతో మాట్లాడారు. ‘‘చర్చల ద్వారా రైతు సంఘాలు సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలి. అంతేగానీ.. రాజకీయ పార్టీల ప్రలోభాలకు రైతు సంఘాలు గురి కావొద్దు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని గుర్తించాలి’’ అని కోరారాయన.
అలాగే.. రైతుల మార్చ్ నేపథ్యంలో దేశ రాజధాని ప్రాంతంలో.. శివారుల్లో భారీగా ట్రాఫిక్ ఝామ్ ఏర్పడుతోంది. ఈ పరిణామంపైనా మంత్రి అర్జున్ ముండా స్పందించారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగించవద్దని రైతుల్ని కోరారాయన. మరోవైపు చర్చల పిలుపుపై రైతు సంఘాలు స్పందించాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. ఢిల్లీ సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచే పంజాబ్, హర్యానా, యూపీ నుంచి ఢిల్లీ వెళ్లే సరిహద్దులోనే ఉండిపోయారు. మంగళవారం ఉదయం నుంచే ఢిల్లీ వైపు వెళ్లేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఢిల్లీకి రెండు వంద కిలోమీటర్ల పరిధిలోనే వాళ్లను నిలువరించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సరిహద్దులో బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది.
#WATCH | Farmers' protest | Tear gas shells fired to disperse the agitating farmers who were approaching the Police barricade.
Visuals from Shambhu Border. pic.twitter.com/AnROqRZfTQ— ANI (@ANI) February 14, 2024