కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జాతీయ స్థాయి మహిళా షూటర్ అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. హౌరాలోని తమ ఇంటినుంచి గురువారం సాయంత్రం బయటకు వెళ్లిన దమయంతి సేన్ అనే 15 ఏళ్ల షూటర్.. అటు తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. ఇంటి అవసరాల కోసం సరుకులు తేవడానికి వెళ్లిన ఆమె.. చివరిసారి రైల్వే స్టేషన్లో కనిపించింది.
దీనిపై ఆమె తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తమ కుమార్తె ఎందుకు తిరిగి రాలేదో అనే విషయం అర్థం కాక సతమతమవుతున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఆమె చివరిసారి హౌరా రైల్వే స్టేషన్లో కనిపించిన దృశ్యాలు తల్లిదండ్రులతో పాటు రాష్ట్ర షూటింగ్ క్రీడా వర్గాల్లో కూడా తీవ్ర ఆందోళన రేపుతున్నాయి.
తమతో ఎటువంటి విభేదాలు కూడా దమయంతికి లేవని, ఎందుకు బయటకు వెళ్లి తిరిగి రాలేదో తెలియడం లేదంటున్నారు. పింక్ టీ షర్ట్ ధరించి ఉన్న తమ అమ్మాయి ఎక్కడైనా, ఎవరికైనా కనిపిస్తే దయచేసి సమాచారం తెలపాలని వారు విన్నవించుకున్నారు.
జాతీయ ట్రయల్స్కు ఎంపికైన తర్వాత దమయంతి ప్రతిరోజూ ప్రాక్టీస్ కోసం తెల్లవారుజామునే లేస్తూ, ఒక కఠినమైన దినచర్యను పాటించేదని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. కుటుంబంలో ఇటీవల ఎలాంటి విభేదాలు లేవని వారు చెప్పారు.
పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హౌరా స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్లో గురువారం ఆమె నాలుగు, ఐదు ప్లాట్ఫారాల మధ్య తిరుగుతున్నట్లు కనిపించిందన్నారు. సీసీ కెమెరాలో ఆమె దొరికిన తర్వాత, ఆమె కదలికలను నిర్ధారించుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఆమె వద్ద మొబైల్ ఫోన్ కూడా ఉన్నట్లు తెలిపారు.
షూటింగ్ వర్గాల్లో కలకలం..
పశ్చిమ బెంగాల్కు చెందిన రైఫిల్ షూటర్ దమయంతి సేన్ ఇటీవల ప్రతిష్టాత్మకమైన జాతీయ జట్టు ఎంపిక ట్రయల్స్కు ఎంపికై తన క్రీడా జీవితంలోనే అతిపెద్ద విజయాన్ని అందుకుంది. సెంట్రల్ హౌరాకు చెందిన దమయంతి.. కోల్కతాలోని ప్రముఖ ఒలింపియన్ జాయ్దీప్ కర్మాకర్ రైఫిల్ షూటింగ్ అకాడమీలో శిక్షణ పొందుతోంది.
రాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి జూనియర్ షూటింగ్ స్క్వాడ్ ట్రయల్స్కు అర్హత సాధించడం ఆమె సాధించిన అతిపెద్ద ఘనత. ఈ ఎంపిక ద్వారా ఆమె భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అత్యంత కీలకమైన అవకాశాన్ని దక్కించుకుంది ఈ తరుణంలో ఆమె మిస్సింగ్ వార్త రాష్ట్రంలోని షూటింగ్ వర్గాల్లో కలకలంగా మారింది.