ఆకాశంలో మరో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. చంద్రుడు సూర్యుడికి అడ్డుగా వచ్చి పూర్తిగా కప్పివేయడంతో బుధవారం (ఆగస్టు 12) సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. కొన్ని ప్రాంతాల్లో పగటి వేళే చీకట్లు కమ్ముకోగా.. సూర్యుడి బాహ్య వాతావరణమైన ‘కరోనా’ స్పష్టంగా కనిపించనుంది. అయితే ఆకాశంలో అద్భుతం జరుగుతున్నా.. భారత్ మాత్రం ఈసారి సూర్యుడి ‘మాయ’ను ప్రత్యక్షంగా చూసే అదృష్టాన్ని కోల్పోనుంది.
భారత కాలమానం ప్రకారం.. పాక్షిక గ్రహణం రాత్రి సుమారు 9 గంటల సమయంలో ప్రారంభమవుతుంది. రాత్రి 9.15 గంటల ప్రాంతంలో సంపూర్ణ గ్రహణం మొదలవుతుంది. రాత్రి 11.16–11.17 గంటల సమయంలో గరిష్ఠ దశకు చేరుకుంది. ఆగస్టు 13 తెల్లవారుజామున సంపూర్ణ దశ ముగుస్తుంది. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో గ్రహణం పూర్తిగా వీడిపోతుంది.
జ్యోతిష విశ్వాసాలు.. ఏ రాశులపై ఎలాంటి ప్రభావం?
జ్యోతిష సంప్రదాయాల ప్రకారం.. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం కర్కాటక రాశిలోని ఆశ్లేషా నక్షత్రంలో కేతుగ్రస్త సూర్యగ్రహణంగా సంభవిస్తుందని భావిస్తారు. గ్రహణం కనిపించే ప్రాంతాల్లో నివసించే ఆశ్లేషా నక్షత్రజాతకులు, కర్కాటక రాశివారు గ్రహణ శాంతి, జపం, దానధర్మాలు చేయడం శ్రేయస్కరమని జ్యోతిష పండితులు సూచిస్తారు. అయితే ఈ గ్రహణం భారత్లో కనిపించదు కాబట్టి.. ఇక్కడ నివసించే వారికి ప్రత్యేక గ్రహణ శాంతులు అవసరం లేదని సంప్రదాయాలు చెబుతున్నాయి. అయితే..
జ్యోతిష విశ్వాసాల ప్రకారం కర్కాటక, సింహ, మేష, ధనుస్సు రాశులపై ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఉండొచ్చని, వృషభ, కన్య, తుల, కుంభ రాశులకు అనుకూల ఫలితాలు ఉంటాయని చెబుతారు. మిగిలిన రాశులైన మిథున, వృశ్చిక, మకర, మీన రాశులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయని పేర్కొంటారు. ఇవి సాధారణ గోచార ఫలితాలు మాత్రమేనని, వ్యక్తిగత ఫలితాలు జన్మకుండలి ఆధారంగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు. గ్రహణ సమయంలో గాయత్రీ మంత్రం, ఆదిత్య హృదయం, విష్ణు సహస్రనామం, మహామృత్యుంజయ మంత్ర జపం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు.
2034 వరకు భారత్కు ఎదురుచూపులే!
ఆగస్టు 12న ఏర్పడే సంపూర్ణ సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం రాత్రి సమయంలో జరుగుతుంది. గ్రహణం ప్రారంభమయ్యే సమయానికి భారత్లో సూర్యుడు అస్తమించి ఉంటాడు. దీంతో దేశంలోని ఏ ప్రాంతం నుంచీ ఈ గ్రహణాన్ని చూడలేం. భారత్ నుంచి తదుపరి సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూడాలంటే ఇంకా కొన్ని సంవత్సరాలు వేచి చూడాల్సిందే. 2034 మార్చి 20న భారత్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించే అవకాశం ఉంది. అంతవరకు భారతీయ ఖగోళ అభిమానులు ఈసారి గ్రహణాన్ని అంతరిక్ష సంస్థల ప్రత్యక్ష ప్రసారాల ద్వారా మాత్రమే వీక్షించాల్సి ఉంటుంది. అంటే
27 ఏళ్ల తర్వాత యూరప్కు అరుదైన అవకాశం
ఈ సంపూర్ణ సూర్యగ్రహణం యూరప్కు ప్రత్యేకమైనది. 1999 తర్వాత యూరప్ ప్రధాన భూభాగంలో కనిపించే తొలి సంపూర్ణ సూర్యగ్రహణం ఇదే. సుమారు 98 కోట్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా పాక్షిక గ్రహణాన్ని చూడగల అవకాశం ఉంది. దాదాపు 1.5 కోట్ల మంది ప్రజలు సంపూర్ణ గ్రహణ మార్గంలో ఉండి ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.
ఎక్కడ కనిపించనుంది?
సంపూర్ణ గ్రహణ మార్గం ఉత్తర ప్రాంతాల నుంచి ప్రారంభమై యూరప్ వైపు సాగుతుంది. ప్రధానంగా.. గ్రీన్లాండ్, ఐస్లాండ్, స్పెయిన్, పోర్చుగల్లోని కొన్ని ప్రాంతాలు సంపూర్ణ గ్రహణాన్ని వీక్షించే అవకాశం పొందనున్నాయి. స్పెయిన్లోని లియోన్, వల్లడోలిడ్, జరగోజా, టెరుయెల్, వాలెన్సియా వంటి నగరాలు గ్రహణాన్ని చూసేందుకు అత్యుత్తమ ప్రాంతాలుగా నిలవనున్నాయి. మాడ్రిడ్, బార్సిలోనా నగరాల్లో సూర్యుడిలో 99 శాతానికి పైగా భాగం కప్పుకున్నా.. సంపూర్ణ గ్రహణం మాత్రం కనిపించదు.
రెండు నిమిషాలకు పైగా పగలే చీకటి
సంపూర్ణ గ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుడి ముఖాన్ని పూర్తిగా కప్పివేస్తాడు. ఆ సమయంలో సూర్యకాంతి తగ్గిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో పగటి వేళే చీకటి వాతావరణం ఏర్పడుతుంది. ఈ దశ గరిష్ఠంగా 2 నిమిషాల 18 సెకన్ల వరకు కొనసాగనుంది.
ఈ సమయంలో..
సూర్యుడి కరోనా స్పష్టంగా కనిపిస్తుంది. ఉష్ణోగ్రతలు కొంత తగ్గుతాయి. ప్రకాశవంతమైన నక్షత్రాలు, గ్రహాలు కనిపించే అవకాశం ఉంటుంది. ఖగోళ శాస్త్రవేత్తలకు ఇది పరిశోధనలకు కీలక సమయం.
సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుంది?
చంద్రుడు భూమి, సూర్యుడి మధ్యకు వచ్చినప్పుడు సూర్యకాంతిని అడ్డుకుంటాడు. చంద్రుడి నీడ భూమిపై పడిన ప్రాంతాల్లో సూర్యగ్రహణం కనిపిస్తుంది. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పితే దాన్ని సంపూర్ణ సూర్యగ్రహణం అంటారు. కొంత భాగం మాత్రమే కప్పితే అది పాక్షిక సూర్యగ్రహణం అవుతుంది.
గ్రహణాన్ని చూసేవారు జాగ్రత్త!
గ్రహణాన్ని వీక్షించే వారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతుంటారు.
✅ ప్రత్యేక సోలార్ ఎక్లిప్స్ గ్లాసెస్ మాత్రమే ఉపయోగించాలి.
❌ సాధారణ సన్గ్లాసెస్తో సూర్యుడిని చూడకూడదు.
❌ టెలిస్కోప్, బైనాక్యులర్, కెమెరా, సెల్ఫోన్ కెమెరాలతో నేరుగా చూడటం ప్రమాదకరం. సరైన రక్షణ లేకుండా గ్రహణ సమయంలో సూర్యుడిని చూడటం కంటి చూపుకు శాశ్వత నష్టం కలిగించే ప్రమాదం ఉంది.