కంపాలా: మాల్దీవులు-భారత్ మధ్య వివాదం నడుస్తున్న వేళ ఇరుదేశాల విదేశాంగ మంత్రులు భేటీ అయ్యారు. ఉగాండ రాజధాని కంపాలాలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్, మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలపై చర్చించారు. శుక్రవారం ప్రారంభమయ్యే నాన్-అలైన్డ్ మూవ్మెంట్(NAM) రెండు రోజుల శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ఇరువురు నేతలు కంపాలాకు వెళ్లారు. ఈ సందర్భంగా భారతదేశంతో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామని మూసా జమీర్ స్పష్టం చేశారు.
నామ్ సమ్మిట్లో భాగంగా జైశంకర్ని కలవడం ఆనందంగా ఉందని మూసా జమీర్ ట్విట్టర్(ఎక్స్) లో తెలిపారు. మాల్దీవుల నుంచి భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ, అలాగే తమ దేశంలో జరుగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించినట్లు పేర్కొన్నారు. సార్క్, నామ్ల సహకారంపై అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిపారు. భారతదేశంతో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
Met Maldives FM @MoosaZameer today in Kampala.
A frank conversation on 🇮🇳-🇲🇻 ties. Also discussed NAM related issues. pic.twitter.com/P7ResFlCaK— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 18, 2024
మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ చైనా అనుకూల విధానాలను అనుసరిస్తున్నారు. నవంబర్లో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత సైనిక సిబ్బందిని మాల్దీవుల నుంచి తరిమివేస్తానని ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారు. దానికితోడు ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద ట్వీట్లు చేయడం.. భారత్-మాల్దీవుల మధ్య సంబంధాలు ఒత్తిడికి గురయ్యాయి. మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని మార్చి 15వరకు గడువు కూడా విధించారు. ఈ సందర్భంగా ఇరుదేశాల నేతలు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదీ చదవండి: హౌతీలపై భూతల దాడులకు యెమెన్ పిలుపు