గుజరాత్ తీరంలోని కీలకమైన ‘కాంబే ఆఫ్షోర్’ చమురు, సహజవాయువు బ్లాక్ను నిలబెట్టుకోవాలనుకున్న వేదాంత లిమిటెడ్ ప్రయత్నాలకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వేదాంతకు కాంట్రాక్ట్ పొడిగింపును నిరాకరిస్తూ ఆ ఫెసిలిటీని ప్రభుత్వ రంగానికి చెందిన ఓఎన్జీసీకి అప్పగించాలన్న కేంద్రం నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్థానం సమర్థించింది.
హైకోర్టు కీలక వ్యాఖ్యలు
జస్టిస్ పురుషేంద్ర కుమార్ కౌరవ్ నేతృత్వంలోని ధర్మాసనం వేదాంత పిటిషన్ను కొట్టివేసింది. 2017 ‘ప్రీ-నెల్ప్’ విధానం కింద ఉత్పత్తి పంచుకునే ఒప్పందం (పీఎస్సీ) పొడిగింపును కోరడం కంపెనీ ప్రాథమిక హక్కు కాదని స్పష్టం చేసింది. దేశ సహజ వనరులకు రక్షణగా ఉన్న ప్రభుత్వానికి దరఖాస్తుదారు సాంకేతిక అర్హతలతో పాటు వారి ప్రవర్తనను పరిశీలించే పూర్తి అధికారముందని కోర్టు పేర్కొంది. ‘ప్రాఫిట్ పెట్రోలియం’ ప్రభుత్వ వాటా నుంచి సుమారు రూ.88 కోట్లను వేదాంత ఏకపక్షంగా మినహాయించుకోవడాన్ని తీవ్రంగా పరిగణించింది.
ఏమిటీ వివాదం?
గుజరాత్లోని సూరత్ జిల్లా సువాలి తీరానికి సమీపంలో ఉన్న CB-OS/2 బ్లాక్లోని ‘లక్ష్మి’, ‘గౌరి’ క్షేత్రాల నుంచి రోజుకు 3,400 బ్యారెళ్ల చమురు, 3.4 లక్షల ఎస్సీఎం సహజ వాయువు ఉత్పత్తి అవుతోంది. వేదాంత 1998 నుంచి వీటిని నిర్వహిస్తోంది. 2023 జూన్లో ముగిసిన ఒరిజినల్ ఒప్పందాన్ని మరో 10 ఏళ్లు పొడిగించాలని వేదాంత కోరినప్పటికీ నిబంధనల ఉల్లంఘన, బకాయిలను కారణం చూపుతూ కేంద్రం అభ్యర్థనను తిరస్కరించి ఓఎన్జీసీకి అప్పగించాలని ఆదేశించింది.
కోర్టు స్టేకు నిరాకరణ
తీర్పు వెలువడిన వెంటనే ఉన్నత న్యాయస్థానాన్ని (సుప్రీంకోర్టు) ఆశ్రయించేందుకు వీలుగా యథాతథ స్థితి (స్టేటస్ కో) విధించాలని వేదాంత కోరగా హైకోర్టు దానికి నిరాకరించింది. దాంతో ప్రభుత్వాదేశాల అమలుకు మార్గం సుగమమైంది. ఈ ప్రతికూల తీర్పు వార్తలతో స్టాక్ మార్కెట్లో వేదాంత లిమిటెడ్ షేరు క్షీణించింది.