భారతదేశంలోని అత్యున్నత ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ఒకటైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) అంతర్జాతీయ విస్తరణలో భాగంగా 2026 నాటికి నైజీరియాలో క్యాంపస్ను ఏర్పాటు చేయనుంది. ఇది పశ్చిమ ఆఫ్రికాలో భారతదేశానికి చెందిన మొదటి ఐఐటీ క్యాంపస్ కానుంది.
నైజీరియాలో ఎందుకు?
-
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) 2020 అమలులో భాగంగా విదేశాల్లో క్యాంపస్లను ఏర్పాటు చేయాలని భారతీయ విశ్వవిద్యాలయాలను ప్రోత్సహిస్తున్నారు. ఈ విస్తరణ ద్వారా భారతదేశం తన అకడమిక్ సామర్థ్యాన్ని ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
-
ఈ క్యాంపస్ ద్వారా భారత్, నైజీరియా మధ్య విద్యా, సాంకేతిక రంగాల్లో సహకారం మరింత పెరుగుతుంది.
-
ఆఫ్రికా ఖండంలో శాస్త్ర, సాంకేతిక విద్యను ప్రోత్సహించడం ద్వారా దీర్ఘకాలిక భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాలని భారత్ భావిస్తోంది.
-
నైజీరియా ప్రభుత్వం తమ దేశాన్ని ప్రాంతీయ సాంకేతిక కేంద్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ స్థాయి విద్యాసంస్థ అయిన ఐఐటీ ఏర్పాటుతో ఈ లక్ష్యం వేగవంతమవుతుందని నైజీరియా విశ్వసిస్తోంది.
-
నైజీరియా విద్యార్థులకు స్వదేశంలోనే నాణ్యమైన ఇంజినీరింగ్, సాంకేతిక విద్యను అందించడానికి భారత ఐఐటీ ఉపయోగపడుతుంది. ఇది ‘బ్రెయిన్ డ్రెయిన్’(ఉన్నత విద్య కోసం విద్యార్థులు విదేశాలకు వెళ్లడం) సమస్యను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
ఈ క్యాంపస్ పనులు ఏ దశలో ఉన్నాయి?
నైజీరియాలో ఐఐటీ క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించిన పనులు ప్రణాళిక దశలో ఉన్నాయి. ఈ క్యాంపస్ సులేజాలోని ఫెడరల్ గవర్నమెంట్ అకాడమీ (FGA)లో ఏర్పాటు కానుంది. ఈ ప్రాంతాన్ని ‘నైజీరియన్ అకాడమీ ఫర్ ది గిఫ్టెడ్’ అని కూడా పిలుస్తారు. ఈ అకాడమీని భారత్ సహకారంతో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా మార్చనున్నారు. ఈ క్యాంపస్లో అధ్యాపకుల నియామకం, కోర్సుల రూపకల్పనను పర్యవేక్షించడానికి ఇండియా, నైజీరియాకు చెందిన సంయుక్త బృందం పని చేస్తుంది.
🚨 India is opening a IIT campus in Nigeria in 2026. pic.twitter.com/oPocRgVNhJ
— Indian Tech & Infra (@IndianTechGuide) October 29, 2025
2026 నాటికి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థుల మొదటి బ్యాచ్ ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. క్యాంపస్ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ను నైజీరియా ప్రభుత్వం నిర్వహిస్తుంది. ప్రస్తుతానికి ఈ క్యాంపస్లో ప్రవేశానికి సంబంధించిన కచ్చితమైన తుది వివరాలు ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే నవంబర్ 2023లో టాంజానియాలో భారత్ ఐఐటీ క్యాంపస్ను ఏర్పాటు చేసింది.
ఇదీ చదవండి: వీసా, మాస్టర్ కార్డుకు రూపే గట్టి పోటీ.. కారణాలు..