చంద్రగిరి: మద్యం మత్తు ఇద్దరు అన్నదమ్ములను బలితీసుకుంది. మద్యం సేవించి కారులో నిద్రపోయిన వారిద్దరూ.. చివరకు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తిరుపతి రూరల్ మండలం తిరుచానూరులోని రంగనాథ రోడ్డులో జరిగింది. పోలీసులు కథనం మేరకు.. తిరుపతి జిల్లా బుచి్చనాయుడుకండ్రిగ, గోవిందప్ప కండ్రిగలకు చెందిన దిలీప్(25), వినాయక అలియాస్ వినయ్(20) వరుసకు అన్నదమ్ములు.
గ్యాస్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్న దిలీప్ తిరుచానూరులోని రంగనాథ రోడ్డులో భార్య, కుమారుడితో కలిసి నివసిస్తున్నాడు. వినయ్ టీటీడీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ అన్నమయ్య సర్కిల్ వద్ద ఉంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం వీరిద్దరూ మద్యం తాగారు. రాత్రి సమయంలో దిలీప్ ఇంటి సమీపంలోని కారులోకి మకాం మార్చారు. అందులోనే మద్యం సేవించి.. ఏసీ ఆన్ చేసుకొని నిద్రపోయారు. కొంతసేపటికి పెట్రోల్ అయిపోవడంతో కారు ఇంజిన్ ఆగిపోయింది. అద్దాలు మూసిఉండటంతో మత్తులో ఉన్న వారిద్దరూ ఊపిరాడక మరణించారు. కారుపై కవర్ కప్పి ఉండటంతో ఎవరూ గుర్తించలేకపోయారు.