సింహాచలం (విశాఖ): రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే అక్టోబర్ 10వ తేదీన లక్ష మంది గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో విజయవాడ మార్చ్ నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక (జేఏసీ) ప్రకటించింది. విశాఖపట్నంలోని సింహాచలంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర చైర్మన్ జానీ పాషా మాట్లాడుతూ వలంటీర్ల విధులను గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వర్తించబోరని స్పష్టం చేశారు.
తక్షణమే ఇంటింటి సర్వే విధుల నుంచి సచివాలయ ఉద్యోగులను తప్పించాలని డిమాండ్ చేశారు. నోషనల్ ఇంక్రిమెంట్లు, 9 నెలల అరియర్స్ను వెంటనే మంజూరు చేయాలన్నారు. ఆరేళ్లు సర్వీçÜు పూర్తయిన ప్రతి సెక్రటరీకి ఏఏఎస్ ఇంక్రిమెంట్ వర్తింపజేయాలని, ఉద్యోగులందరికీ జూనియర్ అసిస్టెంట్ స్కేల్కు అప్గ్రేడ్ చేసి ప్రమోషన్ చానల్ కల్పించాలని, జాబ్ చార్ట్ను తక్షణమే అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో జేఏసీ సెక్రటరీ జనరల్ విప్పర్తి విఖిల్ కృష్ణ, కన్వీనర్ అబ్జుల్ రజాక్, అర్గనైజింగ్ సెక్రటరీ వెస్లీ, కో–చైర్మన్లు భార్గవ్ సుతేజ్, అంకమ్మరావు, రాజేష్, వైస్ చైర్మన్లు శ్రీనివాస్, నాగేశ్వరరావు, గ్రేటర్ విశాఖ జేఏసీ సభ్యులు పాల్గొన్నారు.