సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కంపార్ట్మెంట్లు అన్నీ నిండి వెలుపల క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ఇక, నిన్న శ్రీవారిని 66,233 మంది దర్శించుకున్నారు. నిన్న(శుక్రవారం) శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.71కోట్లుగా ఉంది.
తిరుమలలో శుక్రవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. వర్షం కారణంగా ఘటాటోపం కింద స్వామివారు మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అక్టోబర్ 14న అంకురార్పణ, అక్టోబర్ 15–23 వరకు జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.
#తిరుమల
తిరుమలలో నేటి పౌర్ణమి గరుడ సేవ#Tirumala
Today's Paurnami Garuda Seva at Tirumala pic.twitter.com/S1hLwjC6z2— kshetradarshan (@kshetradarshan) September 29, 2023
ఇదిలా ఉండగా.. తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై విధించిన ఆంక్షలను టీటీడీ సడలించింది. టీటీడీ అటవీశాఖతో అధికారులతోపాటు రాష్ట్ర అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతంలో 6 చిరుతలను బంధించడంతో పాటు వారం రోజుల పాటు పూర్తిగా పరిశీలించిన తర్వాత ఎలాంటి ముప్పు లేదని నిర్థారించారు. దీంతో శుక్రవారం నుంచి ఘాట్ రోడ్లలో రాత్రి 10 గంటల వరకు ద్విచక్ర వాహనాలను అనుమతించనున్నారు. అలిపిరి కాలినడక మార్గంలో చిరుతల సంచారం నేపథ్యంలో భక్తుల భద్రత దృష్ట్యా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను టీటీడీ నిలిపివేసిన విషయం తెలిసిందే.