తిరుపతి సిటీ: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యావిధానం ప్రవేశపెట్టడం ద్వారా జ్యోతిరావు పూలే, బీఆర్ అంబేడ్కర్, పెరియార్ రామస్వామి వంటి మహానుభావుల ఆశయాలను నెరవేర్చిన ఘనత సీఎం జగన్మోహన్రెడ్డికి దక్కుతుందని సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు. తాను దర్శకత్వం వహించి నిర్మించిన ‘యూనివర్సిటీ’ సినిమా ప్రమోషన్లో భాగంగా శనివారం తిరుపతి వచ్చిన ఆయన మాట్లాడుతూ.. తెలుగు భాష అమ్మ అయితే.. ఇంగ్లిష్ భాష నడిపించే నాన్న అని, జీతం, జీవితం ఇంగ్లిష్పై ఆధారపడి ఉందని అన్నారు.
భక్తుల రక్షణకు కర్ర ఓ ఆయుధం
తిరుమల కాలినడక మార్గంలో క్రూర మృగాలు భక్తుల ప్రాణాలు తీయడం మనసును కలచివేసిందని నారాయణమూర్తి పేర్కొన్నారు. నడకదారి భక్తులకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి చేతి కర్ర ఇవ్వాలని నిర్ణయించడం ఆహా్వనించదగ్గ విషయమన్నారు. అడవులకు, పొలాలకు వెళ్లే సమయంలో అడవి జంతువుల నుంచి తమకు తాము కాపాడుకోవాలంటే కర్రనే ఉపయోగించారని చెప్పారు.
కర్ర పైకి ఎత్తి మనిషి గాండ్రిస్తే ఎంతటి క్రూర మృగమైనా పారిపోవాల్సిందేనన్నారు. దీనిపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయకుండా వీలైతే సలహాలు ఇవ్వాలని ఆయన సూచించారు. కాగా, విద్యావ్యవస్థ, నిరుద్యోగ సమస్య, పేద విద్యార్థుల, తల్లిదండ్రుల వేదన, నిరుద్యోగ భారతం కాదు ఉద్యోగ భారతం కావాలని, విద్యా వైద్యాన్ని జాతీయం చేయాలనే విషయాలు ప్రధానాంశాలుగా యూనివర్సిటీ సినిమా తీశానని, అక్టోబర్ 4న విడుదల కానుందని చెప్పారు.
ADVERTISEMENT
ADVERTISEMENT