నెల్లూరు: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో కాకాణి మీడియా సమావేశంలో మాట్లాడారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న కక్ష సాధింపు, అతనిపై కేసులపై కేసులు మోపడం వంటి అంశాలపై స్పందించారు. ప్రశ్న రావణ్తో వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధమూ లేదు. రావణ్ టీడీపీకి చెందిన వ్యక్తేనని ఆ పార్టీలోనే చర్చ జరుగుతోందని తెలిపారు.
‘‘చంద్రబాబు, లోకేశ్ను ప్రశంసిస్తూ ప్రశ్న రావణ్ అనేక వీడియోలు పోస్ట్ చేశాడు. తిరుమల లడ్డూపై కూటమి నేతలు పనిగట్టుకుని విషప్రచారం చేశారు. దేవుడి దర్శనం కోసం ఆలయాలకు వచ్చిన భక్తుల ప్రాణాలు తీశారు’’ అని కాకాణి తెలిపారు.
ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసు..
రాష్ట్రంలో కుప్పకూలిన శాంతిభద్రతల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని కాకాణి చెప్పారు. ‘‘యూట్యూబర్ రావణ్పై యూఏపీఏ చట్టం ప్రయోగించడం దేశవ్యాప్తంగా విమర్శలకు దారితీసింది. రావణ్ వ్యాఖ్యలు అభ్యంతరకరమైతే ఏడాది క్రితమే ఎందుకు చర్యలు తీసుకోలేదు.. ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు? యూఏపీఏ చట్టాన్ని రాజకీయ కక్షసాధింపునకు వాడటం అత్యంత ప్రమాదకర పరిణామం.
ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసు.. మరో బెయిల్ వస్తే ఇంకో కేసు పెట్టడం చట్టపాలన కాదు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడానికి పోలీసు వ్యవస్థను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. చంద్రబాబుకు సంక్షోభం వచ్చిన ప్రతిసారీ మతం పేరుతో డైవర్షన్ రాజకీయాలు చేయడం అలవాటే. నిజంగా భక్తి ఉంటే తిరుమల లడ్డూ, ఆలయాల ఘటనలు, భక్తుల భద్రతపై ముందు సమాధానం చెప్పాలి. కస్టోడియల్ డెత్లు, పోలీసుల దుర్వినియోగం, శాంతిభద్రతల వైఫల్యంపై ప్రభుత్వం ప్రజలకు జవాబు చెప్పాలి.
పోలీస్ స్టేషన్లలో మరణాలు, బాధిత కుటుంబాలకు అన్యాయం జరగడం అత్యంత దారుణం. సాయికృష్ణ కేసు ఏమైంది.. క్రాంతికుమార్, గంగమ్మ, తిరుపతమ్మ, కళావతి కేసుల్లో పురోగతి ఎందుకు లేదు? ఈ ఘటనలన్నీ చంద్రబాబు పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలాయని చెబుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే కొత్త కథలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు వ్యవస్థను రాజకీయ అవసరాలకు వాడటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. డైవర్షన్ రాజకీయాలు మానేసి శాంతిభద్రతలు, పోలీసుల దుర్వినియోగంపై చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి" అని తెలిపారు.
కాకాణిపై కేసును కొట్టేసిన హైకోర్టు
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పొదలకూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. రైతులకు అండగా పొదలకూరు పోలీస్ స్టేషన్ ముందు గతంలో కాకాణి నిరసన తెలిపారు. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ పొదలకూరు పోలీసులు కాకాణి గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసు బనాయించారు. పొదలకూరు పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసును సవాల్ చేస్తూ హైకోర్టులో కాకాని గోవర్ధన్ రెడ్డి క్వాష్ పిటిషన్ వేశారు. కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పొదలకూరు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేసింది హైకోర్టు.