హైదరాబాద్: రోగులను ఆస్పత్రికి వేగంగా తరలించడానికి అంబులెన్స్ సర్వీస్ను ఉపయోగిస్తారు. ఆ సైరన్ వినపడగానే రోడ్డుపై ఆ వాహనానికి దారి ఇస్తాం. ట్రాఫిక్ పోలీసులు సైతం తక్షణ అవసరాన్ని గుర్తించి అంబులెన్స్లకు దారి ఇచ్చేలా సిగ్నల్స్ను సైతం అందుకు తగ్గట్టుగా మారుస్తుంటారు. కానీ కొందరు ఈ అంబులెన్స్ సేవలను దుర్వినియోగం చేస్తుంటారు. అవసరం లేకున్నా సైరన్ మోగిస్తారు. ఇటీవల ఇలాంటి ఘటనే తెలంగాణలో వెలుగులోకి వచ్చింది. దీనిపై రాష్ట్ర పోలీసు శాఖ సీరియస్ అయ్యింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంబులెన్స్ సైరన్ను ఉపయోగించాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ ట్వీట్ చేశారు.
#TelanganaPolice urges responsible use of ambulance services, citing misuse of sirens. Genuine emergencies require activating sirens for swift and safe passage. Strict action against abusers is advised.
Together, we can enhance emergency response and community safety. pic.twitter.com/TuRkMeQ3zN— Anjani Kumar IPS (@Anjanikumar_IPS) July 11, 2023
ఓ ఆస్పత్రికి చెందిన అంబులెన్స్ ట్రాఫిక్లో సైరన్ మోగిస్తూ వచ్చింది. ఎమర్జెన్సీని గుర్తించిన ట్రాఫిక్ పోలీసు.. సిగ్నల్స్ను మార్చి ఆ వాహనానికి తక్షణం దారి ఇచ్చారు. కానీ సిగ్నల్ దాటిన తర్వాత డ్రైవర్ ఆ అంబులెన్స్ను ఆపి టిఫిన్ తిన్నట్లు ట్రాఫిక్ పోలీసు గుర్తించారు. రోడ్డు పక్కనే అగి ఉన్న అంబులెన్స్ వద్దకు వచ్చి డ్రైవర్ను ప్రశ్నించగా.. నీరసం వస్తుందంటూ పొంతన లేని సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు. దీంతో ఈ విషయం పోలీసు ఉన్నతాధికారులకు చేరింది.
ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర పోలీసు యంత్రాంగం.. ఆ అంబులెన్స్ డ్రైవర్ తీరుపై సీరియస్ అయ్యింది. అంబులెన్స్ సైరన్ ఎమర్జెన్సీలోనే వాడాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇష్టమున్నట్టు ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఎమర్జెన్సీ సమయంలో మాత్రమే ఆస్పత్రికి వెళ్లడానికి సైరన్ను ఉపయోగించాలని సూచించింది. సమాజ శ్రేయస్సుకు మనమంతా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరింది.
ఇదీ చదవండి: చేతులెత్తేసిన పోలీసులు.. పీఎస్లో హిజ్రాల రణరంగం