సాక్షి, హైదరాబాద్:: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. నవంబరు 30వ తేదీన తెలంగాణకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. డిసెంబరు 3న అయిదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఎన్నికల తేదీలు రావడంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రచారం హోరెత్తిస్తున్నాయి. పోటాపోటీగా ర్యాలీలు, సభలు ఏర్పాటు చేసి ప్రత్యర్ధులపై విమర్శల దాడికి దిగుతున్నాయి. మరోవైపు పలు సర్వేలు తమ ఫలితాలను వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య సర్వేల వార్ నడుస్తోంది. కాంగ్రెస్ ఫేక్ సర్వేలు నిర్వహిస్తోందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. పొలిటికల్ అనలిస్ట్ ముసుగులో ఉన్న పార్ధా దాస్ అనే యువకుడి డబ్బులు ఇచ్చి ఫేక్ సర్వేలు చేయిస్తుందని మండిపడింది. కాంగ్రెస్ అంటేనే మోసమని, తమ ఫేక్ సర్వేలతో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.
ఈ మేరకు కాంగ్రెస్ ఫేక్ సర్వేలు పార్ట్ -1 పేరుతో ట్విటర్ వేదికగా విరుచుపడింది. ‘పొలిటికల్ అనలిస్ట్ ముసుగులో ఉన్న పార్భా దాస్ అనే యువకుడి డబ్బులు ఇచ్చి ఫేక్ సర్వేలు చేయిస్తుంది. 2018 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జి మాణికం ఠాగూర్తో పార్థా దాస్ దోస్తీ. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ పొత్తుతో కేసీఆర్ గెలవడం కష్టమే అంటూ కాంగ్రెస్ ఫేక్ ప్రచారం. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలవరు అంటూ ఫేక్ ప్రచారం. గజ్వేల్లో కేసీఆర్ గెలవడు అంటూ ఫేక్ ప్రచారం..
2019 గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8 లోక్సభ సీట్లు గెలుస్తుంది అంటూ కాంగ్రెస్ ఫేక్ ప్రచారం. అదే కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్లు ఎన్ని అంటే గుండు సున్నా. గోవా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని కలిసి కాంగ్రెస్ గెలుస్తుంది అంటూ ఫేక్ ప్రచారం. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందంటూ ఫేక్ ప్రచారం చేస్తే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుచిత్తు ఓడిపోయింది. ప్రతిసారీ ఫేక్ సర్వేలు ఇస్తూ, బొక్కబొర్లా పడుతున్న కాంగ్రెస్ పార్టీమరోసారి అదే కుట్రతో వస్తుంది తస్మాత్ జాగ్రత్త’ అంటూ ట్వీట్ చేసింది.
కాంగ్రెస్ ఫేక్ సర్వేల బండారం బట్టబయలు.
కాంగ్రెస్ అంటేనే మోసం అని మరోసారి రుజవు అయ్యింది.
పొలిటికల్ అనలిస్ట్ అన్న ముసుగులో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఎలక్షన్ సర్వేలు ఉత్త బూటకం అని పక్కా ఆధారాలతో బట్టబయలు.
ప్రతిసారీ ఫేక్ సర్వేలు ఇస్తూ బొక్కబోర్లా పడుతున్న కాంగ్రెస్... మరోసారి… pic.twitter.com/9jZi60y4Jz— BRS Party (@BRSparty) October 8, 2023
అయితే బీఆర్ఎస్ ట్వీట్పై పార్థ దాస్ స్పందిస్తూ కౌంటర్ దాడికి దిగారు. ‘నాకోసం టైం కేటాయించి నాపై పరిశోధన చేసినందుకు బీఆర్ఎస్ పార్టీకి ధన్యవాదాలునేను రాజకీయాల విద్యార్థిని మాత్రమే. అవును నేను గతంలో తప్పులు చేశాను. కానీ నేను తప్పుగా చేసిన ట్వీట్లను ఎప్పుడూ డిలీట్ చేయలేదు. ఎందుకంటే చేసిన తప్పుల నుంచి నేర్చుకునేందుకు నేను చాలా ఆసక్తిగా ఉన్నాను. అలాగే భవిష్యత్తులో తప్పులు జరగకుండా సరిదిద్దుకోవాలనుకుంటున్నాను.
రాష్ట్రంలో వెలువడే ఎన్నికల ఫలితాలను సరిగ్గా అంచనా వేయడానికి నేను శాస్త్రీయ అధ్యయానం చేయాల్సిన అవసరం ఉందని భావించాను. నేను ఇంతకుముందు పొలిటికల్ కన్సల్టెన్సీలో ఎక్కువగా ఉండేవాడిని. నన్ను నమ్మండి .నా పనితీరుతో క్లయింట్లు చాలా సంతోషంగా ఉండేవారు. ఇక ఈ ఏడాది జరిగిన కర్నాటక ఎన్నికలకు సంబంధించి మీరు నా ట్వీట్లో దేనినీ ఎంపిక చేయనందుకు నేను కొంచెం బాధపడ్డాను. కర్ణాటక ఎన్నికల్లో సరైన రిజల్ట్స్ను అర్థం చేసుకొని నా సర్వే ఫలితాలను ట్విటర్లో షేర్ చేశాను. ఇది సర్వే, రీసెర్చ్ ద్వారా జరిగింది. దీనిని సీరియస్గా తీసుకోవాలని కోరుతున్నాను.
అయితే నా స్టడీ మీ అంచనాలకు సరిపోకపోవటం నా దురదృష్టకరం. నేను నా అధ్యయనాన్ని విడుదల చేస్తూనే ఉంటాను. అలాగే 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని నేను అప్పడే చెప్పాను. ఆ ఆ స్క్రీన్షాట్ని కూడా మీతో షేర్ చేస్తున్నాను. దీనిని మీరు మీ వీడియోలో షేర్ చేసుకోవచ్చు. నాకు ఎవరిపైనా వ్యతిరేకత లేదు. నేను ఎవరికీ అనుకూలంగా లేను. నేను మీ ప్రేమ, ఆప్యాయత, పబ్లిసిటీని ఎంజాయ్ చేస్తున్నాను. ఇక నా బృందం, నా అధ్యయనంపై నాకు నమ్మకం ఉంది.’ అంటూ ట్వీట్ చేశారు.
Thanks to @BRSparty for taking efforts and do a research on me. I am just a student of politics. Yes i made mistakes in the past. I never deleted my wrong judgements (tweets) because i am very keen to learn from my mistakes. And more over i want to correct my mistakes in future.… https://t.co/YUIGaFqJtj pic.twitter.com/Gx7oCYAIzf
— Partha Das (@partha2019LS) October 9, 2023
తెలంగాణలో అమలులోకి ఎన్నికల కోడ్..
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో శంకుస్థాపనలు, ఆవిష్కరణలు ఆగిపోనున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ చేసుకున్న కార్యక్రమలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేసుకోనున్నాయి. సోమవారం మధ్యాహ్నం ట్రైబల్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రారంభోత్సవం, రాంజీగోండు స్మారక ట్రైబల్ మ్యూజియంకు శంకుస్థాపనకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కోడ్ రావడంతో అన్నీ నిలిచిపోయాయి