నేడు సుప్రీంలో ‘ఓటుకు నోటు’ విచారణ | Sakshi
Sakshi News home page

నేడు సుప్రీంలో ‘ఓటుకు నోటు’ విచారణ

Published Fri, May 3 2024 10:03 AM

Telangana Cash for vote case May 3 2024 Hearings Updates

న్యూఢిల్లీ, సాక్షి: దాదాపు దశాబ్దం కిందట.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు రేపిన ఓటుకు నోటు కేసు నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.  ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుముల రేవంత్ రెడ్డి.. ప్రస్తుతం ముఖ్యమంత్రి గా ఉండడంతో ఈ కేసు విచారణ వేరే ప్రాంతానికి బదిలీ చేయాలంటూ పిటిషన్‌ దాఖలైన సంగతి తెలిసే ఉంటుంది.

బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి  ఈ పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ బి.ఆర్ గవాయి, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ జరపనుంది.

2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎర చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. నాటి టీడీపీ నేత రేవంత్‌రెడ్డిని ఇందుకు మధ్యవర్తిగా నియమించారు. టీడీపీ అభ్యర్థికి ఓటేయాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌సన్‌కు డబ్బు ఇస్తూ రేవంత్‌ తెలంగాణ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. తదనంతర పరిణామాల్లో.. ఆయన అరెస్ట్‌ కూడా అయ్యారు.

చంద్రబాబు ప్రలోభ పర్వాన్ని తెలంగాణ ఏసీబీ బయటపెట్టింది. ఫోన్‌లో మాట్లాడుతూ.. ‘‘మనోళ్లు బ్రీఫ్డ్ మీ’’ అని చంద్రబాబున్నారు. ఆ గొంతు బాబుదేనని ఫోరెన్సిక్‌ సైతం నిర్ధారించింది. మరోవైపు ఈ కేసులో చంద్రబాబునాయుడును నిందితుడిగా చేర్చాలంటూ ఆళ్ల గడ్డ రామకృష్ణారెడ్డి(ఆర్కే) వేసిన పిటిషన్‌ సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. తెలంగాణ ఏసీబీ ఈ కేసు ఛార్జిషీట్‌లో చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావించింది. అయినా కూడా ఆయన పేరును నిందితుడిగా చేర్చకపోవడాన్ని  ఆర్కే తన పిటిషన్‌ ద్వారా లేవనెత్తారు.

సంబంధిత వార్త: అందుకే సీబీఐ ఈ కేసు దర్యాప్తు చేయాలి
 

Advertisement
Advertisement