సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రభుత్వంలో కొత్త టీమ్పై ఫోకస్ పెట్టారు. సీఎం ఆఫీసులో పనిచేసే అధికారుల ఎంపికపై రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఇక, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అధికారులకు స్థానచలనం మొదలైంది.
కాగా, తెలంగాణలో త్వరలోనే ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే హైదరాబాద్లో మూడు కమిషనరేట్ల పరిధిలో కమిషనర్లు బదిలీ అయ్యారు. ఇక, ఆయా శాఖల్లో పలువురు అధికారుల జాబితా కూడా సిద్దమైనట్టు తెలుస్తోంది. శాఖల సమీక్షలు పూర్తి కాగానే బదిలీలు ఉంటాయన్న చర్చ ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది. ఒకే స్థానంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న అధికారులకు స్థాన చలనం ఉంటుందనే చర్చ మొదలైంది.
మరోవైపు.. సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సెంట్రల్ సర్వీసుల్లోకి వెళ్లేందుకు స్మితా సబర్వాల్ దరఖాస్తు పెట్టుకున్నట్టు సమాచారం. కాగా, ప్రస్తుతం ఆమె.. నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్నారు. మరోవైపు.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్మితా సబర్వాల్ ఏ సమీక్షకు హాజరు కాకపోవడం గమనార్హం. అంతకుముందు మాజీ సీఎం కేసీఆర్.. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సామర్థ్యాన్ని మెచ్చుకుని ఆమెను కార్యదర్శిగా నియమించారు. సీఎంవో ప్రత్యేక కార్యదర్శితో పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు కూడా అప్పగించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులతో పాటు మిషన్ భగీరథ పనులు కూడా స్మితా సబర్వాల్ పర్యవేక్షించారు.
తాజాగా స్మితా సబర్వాల్ ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. తన 23 ఏళ్ల కేరీర్ గురించి ప్రస్తావిస్తూ ఆమె ఫొటోను షేర్ చేశారు. కొత్త ఛాలెంజ్కు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాను. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
Some pics remind us how far we have come..
through the valleys and the summits. 23 years to this pic… a driven young lady who always walked her will!
Thanks to all your love ♥️,
ever ready for a new challenge. pic.twitter.com/xahFAszBYv— Smita Sabharwal (@SmitaSabharwal) December 13, 2023
ఇదిలా ఉండగా.. స్మితా సబర్వాల్, ఆమ్రపాలి.. మహిళా ఐఏఎస్ అధికారుల పేర్లు మాత్రం ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఒకరు సీఎం ఆఫీసుకు గుడ్ బై చెప్పాలనుకుంటే మరొకరు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. స్మితా సబర్వాల్ సెంట్రల్ సర్వీసుల్లోకి వెళ్లాలని చూస్తుండగా.. ఇటు కేంద్ర సర్వీసులో ఉన్న మరో ఐఏఎస్ ఆమ్రపాలి.. రేవంత్ రెడ్డి టీమ్లో జాయిన్ కానున్నారు అనే చర్చ జరుగుతోంది. దీంతో, ఈ ఐఏఎస్ల అంశం ఆసక్తికరంగా మారింది.