సాక్షి, హైదరాబాద్: నగరవాసులకు సైబరాబాద్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. శీతాకాలం పొగమంచుతో ప్రమాదాల ముప్పు పెరుగుతుండడంతో ఈ కింది సూచనలను, మార్గదర్శకాలను పాటించాలని బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
పాదాచారుల కోసం.. పొగమంచు కారణంగా దృశ్యమానత తగ్గిపోతుంది. ఇది ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉంది. అందుకే పాదాచారులు అత్యవసరమైతే మాత్రమే రోడ్లపైకి రావాలి.
ద్విచక్ర వాహనదారుల కోసం
-
వేగం తగ్గించాలి.. పొగమంచు వల్ల ముందున్న వాహనాలు కనిపించకపోవచ్చు, అందుకే మిత వేగంతో ప్రయాణించాలి.
-
లైట్లు ఆన్లో ఉంచాలి.. వాహనం ముందు -వెనుక లైట్లు ఆన్లో ఉంచడం ద్వారా ఇతర వాహనదారులకు మీరు కనిపించగలుగుతారు.
-
రిఫ్లెక్టివ్ దుస్తులు ధరించాలి: ఇవి వెలుతురు పడినప్పుడు మెరుస్తాయి, తద్వారా మీరు స్పష్టంగా కనిపిస్తారు.
-
హెల్మెట్ వైజర్ను శుభ్రంగా ఉంచాలి: పొగమంచు, తేమ వల్ల వైజర్ మసకబారవచ్చు. స్పష్టంగా కనిపించేందుకు తరచూ శుభ్రం చేయాలి.
ORR (Outer Ring Road) & హైవేల్లో ప్రయాణించే వారికి
-
లేన్ మార్చవద్దు: పొగమంచు వల్ల ఇతర వాహనాలు కనిపించకపోవచ్చు. లేన్ మారడం ప్రమాదకరం.
-
బ్రేక్ సాఫీగా వాడాలి: అకస్మాత్తుగా బ్రేక్ వేయడం వల్ల వెనుక వాహనాలు ఢీకొట్టే ప్రమాదం ఉంది.
-
ఏమర్జెన్సీ పరిస్థితుల్లో ఎడమ లేన్లో వాహనం ఆపాలి: ఇది ఇతర వాహనాలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు అవసరం.
ఈ మార్గదర్శకాలు, సూచనలు ప్రజల భద్రత, ప్రమాద నివారణ, రవాణా సౌకర్యం కోసం రూపొందించబడ్డాయడని సైబరాబాద్ ట్రాఫిక్ విభాగం చెబుతోంది. పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉన్న ఉదయం, రాత్రి సమయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరమని అంటోంది.