శ్రీలంక ఓపెనింగ్ బ్యాటర్ లహిరు తిరిమన్నే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు శనివారం ప్రకటించాడు. గత ఏడాది కాలంగా సరైన అవకాశాలు రాకపోవడంతో తిరిమన్నే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లంక వన్డే జట్టు కెప్టెన్గా వ్యవహరించిన తిరిమన్నే 2010లో అంతర్జాతీయ క్రికెట్లోని అరంగేట్రం చేసి, దాదాపు 13 ఏళ్ల పాటు లంక క్రికెట్కు సేవలందించాడు.
తిరిమన్నే తన కెరీర్లో 44 టెస్ట్లు, 127 వన్డేలు, 26 టీ20లు ఆడాడు. ఇందులో దాదాపు 5600 పరుగులు చేశాడు. బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన తిరిమన్నే.. తన కెరీర్లో 3 టెస్ట్ సెంచరీలు, 4 వన్డే సెంచరీలతో పాటు అన్ని ఫార్మాట్లలో కలిపి 31 అర్ధసెంచరీలు సాధించాడు. తిరిమన్నే చివరిగా 2022లో బెంగళూరు వేదికగా భారత్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఆడాడు.
Lahiru Thirimanne announces his retirement from cricket.
We wish him all the best for his new journey. pic.twitter.com/TygWD5iwzg— CricTracker (@Cricketracker) July 22, 2023
ఆ మ్యాచ్లో 0, 8 పరుగులకే పరిమితమైన అతను జట్టులో స్థానంలో కోల్పోయాడు. తిరిమన్నే తన రిటైర్మెంట్ ప్రకటనను ఇన్స్టా వేదికగా షేర్ చేశాడు. 13 ఏళ్ల పాటు దేశానికి ప్రాతినిథ్యం వహించడం గర్వకారణమని పేర్కొన్నాడు. లంక జట్టుతో తన జర్నీలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.

ఇదిలా ఉంటే, శ్రీలంక జట్టు ప్రస్తుతం స్వదేశంలో పాకిస్తాన్తో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. సిరీస్లో భాగంగా ఇటీవల ముగిసిన తొలి టెస్ట్లో శ్రీలంక.. పాక్ చేతిలో ఓటమిపాలైంది. దీనికి ముందు జరిగిన వరల్డ్కప్ క్వాలిఫయర్స్లో శ్రీలంక ఛాంపియన్గా నిలిచి, ఈ ఏడాది చివర్లో భారత్ వేదకగ జరిగే వన్డే వరల్డ్కప్కు అర్హత సాధించింది.