రంజీ ట్రోఫీ 2025/26 సీజన్లో కర్ణాటక స్టార్ బ్యాటర్ స్మరణ్ రవిచంద్రన్ అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. హుబ్లీ వేదికగా చండీగఢ్తో జరుగుతున్న ఎలైట్ గ్రూప్ బి మ్యాచ్లో రవిచంద్రన్ అజేయ డబుల్ సెంచరీతో చెలరేగాడు. స్మరణ్ 362 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్స్లతో 227 పరుగులు చేశాడు. ఈ సీజన్లో ఇది అతడికి రెండో ద్విశతకం కావడం గమనార్హం.
అంతకుముందు కేరళతో జరిగిన మ్యాచ్లోనూ డబుల్ సెంచరీ సాధించాడు. ఓవరాల్గా స్మరణ్కు ఇది మూడో ఫస్ట్ క్లాస్ డబుల్ సెంచరీ. ఈ మ్యాచ్లోనే అతడు 1,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఫీట్ను కేవలం 13 ఫస్ట్-క్లాస్ మ్యాచ్లలోనే సాధించడం విశేషం.
రవిచంద్రన్ డబుల్ సెంచరీ ఫలితంగా కర్ణాటక తమ తొలి ఇన్నింగ్స్ను 547/8 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. స్మరణ్తో పాటు కరుణ్ నాయర్(95), శ్రేయస్ గోపాల్(62), శిఖర్ శెట్టి(59) హాఫ్ సెంచరీలతో రాణించారు. చండీఘడ్ బౌలలర్లలో జగజీత్ సింగ్, విషు తలా రెండు వికెట్లు సాధించారు.
ఎస్ఆర్హెచ్లో స్మరణ్..
ఐపీఎల్లో స్మరణ్ రవిచంద్రన్ సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.. గత సీజన్లో గాయపడిన ఆడమ్ జంపా స్థానంలో స్మరణ్ను ఎస్ఆర్హెచ్ తమ జట్టులోకి తీసుకుంది. అతని బేస్ ధర రూ. 30 లక్షలకు సొంతం చేసుకుంది. అయితే ప్రాక్టీస్ సెషన్లో స్మరణ్ గాయపడడంతో సీజన్ మధ్యలోనే వైదొలిగాడు. అతడి స్దానంలో హర్ష్ దూబేకి అవకాశం దక్కింది. అయితే ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు సన్రైజర్స్ అతడిని రిటైన్ చేసుకుంది.
చదవండి: 'ఏమి చేయాలో అతడికి తెలుసు.. మధ్యలో నీ జోక్యమెందుకు'