రంజీ ట్రోఫీ 2024లో భాగంగా ఆసోంతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై మీడియం పేసర్ శార్దూల్ ఠాకూర్ నిప్పులు చెరిగాడు. కేవలం 21 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా అసోం 84 పరుగులకే కుప్పకూలింది. శార్దూల్తో పాటు షమ్స్ ములానీ (2/8), తుషార్ దేశ్పాండే (1/32), మోహిత్ అవస్థి (1/10) కూడా చెలరేగడంతో అసోం ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. అసోం ఆటగాళ్లలో అభిషేక్ ఠాకూరీ (31), సాహిల్ జైన్ (12), అబ్దుల్ అజీజ్ ఖురేషి (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
SHARDUL THAKUR MASTERCLASS 🤯
- Thakur took 6 wickets for just 21 runs against Assam in Ranji Trophy. pic.twitter.com/usthQsPu2Z— Johns. (@CricCrazyJohns) February 16, 2024
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై టీ విరామం (24.4 ఓవర్లు) సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. ముంబై ఓపెనర్లలో పృథ్వీ షా వేగంగా 30 పరుగులు చేసి ఆకట్టుకోగా.. భుపేన్ లల్వాని డకౌటయ్యాడు. వన్డౌన్లో బరిలోకి దిగిన హార్దిక్ తామోర్ 22 పరుగులు చేయగా.. ఐదో నంబర్ ఆటగాడు సుయాంశ్ షేడ్గే డకౌటయ్యాడు. కెప్టెన్ అజింక్య రహానే (18), శివమ్ దూబే (26) క్రీజ్లో ఉన్నారు. అసోం బౌలర్లలో రాహుల్ సింగ్ 2, సునలీ లచిత్, దిబాకర్ జోహ్రి తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది.