హైదరాబాద్: మెదక్ ఎంపీ, సిద్దిపేట జిల్లా దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై హత్యాయత్నం ఘటన రాజకీయంగా కలకలం రేపింది. దీని వెనుక ఏ పార్టీ, ఎవరు ఉన్నారనేది పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. ఈనేపథ్యంలో కేటీఆర్ ట్విటర్ ద్వారా స్పందించారు.
ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసింది కాంగ్రెస్ గూండానే అంటూ.. ఆ పార్టీ కండువాతో ఉన్న నిందితుడి ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు. ఇంకా ఆధారాలు కావాలా అని రాహుల్గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు.
The Congress Goon who unleashed the murder attack on MP Prabhakar Reddy yesterday
Do you need more proofs Rahul Gandhi ? pic.twitter.com/HceItfzvUL— KTR (@KTRBRS) October 31, 2023
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సిద్ధిపేట పోలీసులు.. రాజకీయ కుట్ర కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. మిరుదొడ్డి మండలం చేప్యాలకు చెందిన నిందితుడు దళితబంధు, ఇంటి స్థలం రాకపోవడంతో ఎంపీపై కక్షగట్టాడని, ఎన్నికల కోడ్ ఉండడంతో తర్వాత చూద్దామని ఎంపీ చెప్పడంతో కోపం పెంచుకుని దాడికి తెగబడ్డాడని ప్రచారం జరిగింది.
అయితే.. దాడిలో రాజకీయ ఉద్దేశం ఉండొచ్చని బీఆర్ఎస్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అందుకే రాజు ఎవరెవరితో ఫోన్ కాల్ మాట్లాడింది తెలుసుకునేందుకు కాల్డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోవైపు చేప్యాలలో నిందితుడి తల్లిదండ్రుల్ని పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టారు. గ్రామంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.