ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిగ్రీ పట్టాపై రాజకీయ వివాదం గత కొన్నాళ్లుగా కొనసాగుతోంది. మోదీ ఎడ్యూకేషన్ వివరాలపై కాంగ్రెస్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నలు లేవనెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ విమర్శలకు తెరదించుతూ ప్రముఖ జర్నలిస్టు శీలా భట్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.
తాను ప్రధాని మోదీని 1981లో కలుకున్నట్లు శీలా భట్ చెప్పారు. ప్రధాని మోదీ పూర్తిగా చదువులపై దృష్టి కేంద్రీకరించిన, క్రమశిక్షణ కలిగిన శిష్యుడిగా ఉండేవాడని తెలిపారు. అప్పుడు మోదీ ఎంఏ రెండో సంవత్సరం చదువుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఏఎన్ఐకి చెందిన ఎడిటర్ స్మితా ప్రకాశ్ నిర్వహించిన ఓ ఇంటర్వూలో ఆమె తెలిపారు.
ప్రధాని మోదీకి మెంటర్గా పనిచేసిన ప్రొఫెసర్ ప్రవీణ్ సేత్.. తనకూ కూడా మెంటర్గా పనిచేశారని జర్నలిస్టు శీలా భట్ తెలిపారు. ప్రధాని మోదీతో పాటు చదువుకున్న ఓ అభ్యర్థి తనకు ఇంకా గుర్తున్నట్లు శీలా భట్ తెలిపారు. ప్రధానితో పాటు చదువుకున్న ఆయన క్లాస్మెట్.. లాయర్గా పనిచేస్తున్నట్లు చెప్పారు. ప్రధాని నిరక్షరాస్యుడని అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ ఆరోపిస్తున్న వేళ.. నిజానిజాలను తెలపాలని ఆ లాయర్ను కోరినట్లు శీలా భట్ చెప్పారు. కానీ ఆ లాయర్ స్పందించలేదని తెలిపారు.
“I met Modi in 1981 when he was doing his MA,” Veteran Journo Sheela Bhatt recalls PM’s student days#Modi #ANIPodcastWithSmitaPrakash #SheelaBhatt
Watch the full episode here: https://t.co/IMz0tvhuNX pic.twitter.com/6icGf2O6yz— ANI (@ANI) July 13, 2023
ప్రధాని ఎడ్యూకేషన్ వివరాలపై గతంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. ఆ వివరాలను రాబట్టడానికి ప్రయత్నాలు కూడా చేశారు. 2016లో ప్రధాని ఎంఏ డిగ్రీ వివరాలు సమర్పించాలని గుజరాత్ యూనివర్శిటీని ప్రధాన సమాచార కమిషనర్ కోరారు. ఈ అంశంలో గుజరాత్ హైకోర్టు.. కమిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చింది.
ఈ తీర్పు అనంతరం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టు తీర్పు ప్రజలకు చాలా ప్రశ్నలను మిగిల్చిందని అన్నారు. నవీన భారతంలో పారదర్శకతకు కూడా పరిమితులు ఉన్నాయని.. ఇదే పొలిటికల్ సైన్స్ బోధిస్తోందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అప్పట్లో వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
ప్రధాని డిగ్రీ సమాచారంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును పునసమీక్షించాలని గత నెలలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోమారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే.. ప్రధాని డిగ్రీ సమాచారం ఆన్లైన్లో అందుబాటులో ఉందని గుజరాత్ యూనివర్శిటీ పేర్కొంది. అలాంటిదేమీ లేదని కేజ్రీవాల్ అన్నారు.
ఇదీ చదవండి: Chandrayaan-3: ఆవలి దిక్కున... జాబిలి చిక్కేనా!