ఢిల్లీ: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు కర్ణాటకలో బీజేపీకి తన పాత మిత్రుడు తోడు నిలిచాడు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఎన్డీయే, జేడీఎస్ కలిసే పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈమేరకు జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) ఎన్డీయేలో చేరుతున్నట్లు స్పష్టం చేసింది.
జేడీఎస్ చీఫ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి.. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షాలతో సమావేశమైన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. అయితే ఈ చేరిక తదనంతర.. సీట్ల పంపకాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే.. జేడీఎస్కు నాలుగు సీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఇరుపార్టీల నేతలు ఫొటోలు షేర్ చేస్తూ ఈ మేరకు తెలిపారు.
'ఎన్డీయే, జేడీఎస్ కలిసి పోటీ చేస్తాయని తెలపడానికి సంతోషం వ్యక్తం చేస్తున్నా. ఎన్డీయేలో చేరినందుకు జేడీఎస్కు అభినందనలు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మరోసారి ఎన్డీయేకి మరింత బలం చేకూర్చినట్లయింది' అని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అన్నారు.
Met Former Chief Minister of Karnataka and JD(S) leader Shri H.D. Kumaraswamy in the presence of our senior leader and Home Minister Shri @AmitShah Ji.
I am happy that JD(S) has decided to be the part of National Democratic Alliance. We wholeheartedly welcome them in the NDA.… pic.twitter.com/eRDUdCwLJc— Jagat Prakash Nadda (@JPNadda) September 22, 2023
బీజేపీతో చేరిపోతున్నారా..? అని గతవారం కుమారస్వామిని అడగగా.. గణేష్ చతుర్థి తర్వాత ఏదో ఒక ప్రకటన వెలువరిస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతం అధికారికంగా ప్రకటించారు. అయితే.. లోక్సభ ఎన్నికల కోసం నాలుగు సీట్లు జేడీఎస్కే కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ ఓటమి పాలైంది. ఆ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే ఈ పొత్తు సార్వత్రిక ఎన్నికలకే పరిమితం అవుతుందా? రాష్ట్ర రాజకీయాల్లోనూ కొనసాగుతుందా? అనేదానిపై మాత్రం ఇరు వర్గాలు స్పష్టత ఇవ్వలేదు.
ఇదీ చదవండి: ఎన్సీపీలో రగులుతున్న వివాదం.. శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు?