ఢిల్లీ:జమిలి ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కేంద్రం కమిటీని నియమించింది. దానికితోడు ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సెషన్ను ప్రకటించిన నేపథ్యంలో ఒకే దేశం- ఒకే ఎన్నికల బిల్లు చర్చకు రానుందని రాజకీయ వర్గాల సమాచారం. బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగానే జమిలి ఎన్నికలకు సిద్ధపడిందనే ఊహాగానాలు మొదలయ్యాయి.
ఇదే క్రమంలో జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఎదురయ్యే సవాళ్ల గురించి కూడా విస్తృతంగా చర్చ నడుస్తోంది. దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరపడానికి సరిపడా పోలింగ్ సామాగ్రి మన వద్ద లేవనే వాదనలు వినిపిస్తున్నాయి. జమిలి ఎన్నికలు జరపడానికి రాజ్యాంగ పరంగా కూడా చిక్కులు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. సవరణలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.
‘One Nation One Election’ possible, Constitutional amendment needed: say experts
Read @ANI Story | https://t.co/QkRUL3m1Vf#OneNationOneElection #ParliamentSpecialSession pic.twitter.com/AwHG1QF3Gq— ANI Digital (@ani_digital) September 1, 2023
ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే చేయాల్సిన రాజ్యాంగ సవరణలు..
జమిలీ ఎన్నికలకు అనుగుణంగా ఈ ఆరు ఆర్టికల్లలో విధివిధానాలను సవరించాల్సి ఉంటుంది.
► ఆర్టికల్ 83(2): ఈ ఆర్టికల్ ప్రకారం లోక్సభ గడువు ఐదేళ్లు. ముందుగా కూడా రద్దు చేయవచ్చు.
► ఆర్టికల్ 85: లోక్సభను రద్దు చేయడానికి రాష్ట్రపతికి అధికారం ఉంటుంది. ప్రస్తుత సభ రద్దు అయిన వెంటనే సార్వత్రిక ఎన్నికల అనంతరం కొత్త సభ ఆరంభం అవుతుంది.
► ఆర్టికల్ 172(1): రాష్ట్ర అసెంబ్లీ రద్దు కానంతరవరకు ఐదేళ్ల పాటు గడువు ఉంటుంది.
► ఆర్టికల్ 174(2): కేబినేట్ సూచన మేరకు అసెంబ్లీని రద్దు చేసే అధికారం గవర్నర్కు ఉంటుంది. మెజారిటీ సందిగ్ధంలో ఉన్నప్పుడు గవర్నర్ తన విచక్షణను వినియోగిస్తారు.
► ఆర్టికల్ 356: ఈ ఆర్టికల్ ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది. అవిశ్వాస తీర్మాణం విపక్షాలు నెగ్గినప్పుడు ప్రభుత్వం రద్దు అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో జమిలి ఎన్నికలకు అనుగుణంగా సవరణ చేయాల్సి ఉంటుంది.
► ఈ ఆర్టికల్ల సవరణ ఆమోదం పొందాలంటే పార్లమెంట్లో మూడొంతుల్లో రెండోంతుల సభ్యులు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అంతేకాకుండా అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం తప్పనిసరి. పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత సగం రాష్ట్రాల అసెంబ్లీలు దానికి ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది.
వనరుల కొరత..
లోక్సభ, రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు వచ్చేలా రాజ్యాంగాన్ని సవరించినా.. ఎన్నికల నిర్వహణకు భారీ వనరులు అవసరమవుతాయి. 25 లక్షలకు పైగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (EVM)లు, 25 లక్షల VVPATలు (ఓటర్-వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయిల్) కావాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం వద్ద ప్రస్తుతం కేవలం 12 లక్షల ఈవీఎంలు మాత్రమే ఉన్నాయి. అత్యధిక సంఖ్యలో సిబ్బంది కూడా అవసరమవుతారు.
మొదట్లో జమిలీ ఎన్నికలే..
1967 వరకు భారతదేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం ఆనవాయితీగా ఉండేది. నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఈ విధంగానే జరిగాయి. 1968-69లో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు ముందస్తుగా రద్దు చేయబడిన తర్వాత ఈ పద్ధతి ఆగిపోయింది. లోక్సభ కూడా మొదటిసారిగా 1971లో షెడ్యూల్ కంటే ఒక సంవత్సరం ముందుగా రద్దు చేయబడింది. ఆ తర్వాత మధ్యంతర ఎన్నికలు నిర్వహించారు.
విదేశాల్లో ఇలా..
జమిలి ఎన్నికలపై పార్లమెంటరీ కమిటీ దక్షిణాఫ్రికాను ఉదాహరణగా చూపుతోంది. అక్కడ జాతీయ, స్థానిక స్థానాల్లో ప్రతి ఐదేళ్లకు ఒకసారి మాత్రమే ఎన్నికలు జరుగుతాయి.
స్వీడన్లో కూడా ప్రతి నాలుగేళ్లకు ఒకసారి నిర్ణీత తేదీల్లో మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. నేషనల్ లెజిస్లేచర్ (రిక్స్డాగ్), ప్రావిన్షియల్ లెజిస్లేచర్ (ల్యాండ్స్టింగ్), స్థానిక సంస్థలు/మునిసిపల్ అసెంబ్లీలకు సెప్టెంబర్ రెండో ఆదివారం ఎన్నికలు జరుగుతాయి.
ఇదీ చదవండి: జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక ప్రకటన.. కమిటీ ఏర్పాటు..