‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తొలి సూర్యకిరణాలు తాకే అరసవెల్లి సూర్యనారాయణమూర్తి సాక్షిగా జననేతను సిక్కోలు అక్కున చేర్చుకుంది. మంగళవారం విజయనగరం జిల్లాలో పర్యటన అనంతరం శ్రీకాకుళం జిల్లా అక్కివలసలోని రాత్రి బస శిబిరానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని పలుకరించేందుకు ఉదయం ఆరు గంటల నుంచే పరిసర గ్రామాలకు చెందిన పిల్లలు, పెద్దలు భారీ ఎత్తున తరలివచ్చారు. ప్రియతమ నేతను కళ్లారా చూడాలని, వీలైతే ఓ సెల్ఫీ తీసుకోవాలని ఉత్సాహం చూపారు.
బుధవారం ఉదయం తిరిగి ప్రారంభమైన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 22వ రోజు సుమారు 64 కి.మీ. మేర సాగి టెక్కలి నియోజకవర్గం అక్కవరం బహిరంగ సభతో ముగిసింది. రాత్రి బస శిబిరం వద్ద శ్రీకాకుళం, విజయనగరం నుంచి వచ్చిన పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు సీఎం జగన్ను కలిశారు. సీఎం వారిని పేరుపేరునా పలకరిస్తూ యోగక్షేమాలు ఆరా తీసి దిశానిర్దేశం చేశారు.
అనంతరం వేలాదిగా తరలి వచ్చిన అభిమానులతో అక్కివలస నుంచి ప్రారంభమైన యాత్ర ఆమదాలవలస కొత్తరోడ్డు, మడపాం, నిమ్మాడ, పొడుగుపాడు, కోటబొమ్మాళి జంక్షన్, కన్నెవలస, చమయ్యపేట వరకు సాగింది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం నేతలతో కలసి అక్కవరం బహిరంగ సభ ప్రాంగణం వద్దకు సీఎం చేరుకున్నారు. ‘సిద్ధం సిద్ధం.. సీఎం సీఎం’ అంటూ మిన్నంటిన నినాదాలతో సభా ప్రాంగణం సముద్ర హోరును తలపించింది.
సీఎం మాట్లాడుతుండగా ఆకాశం మేఘావృతం
ఉదయం 10 గంటల ప్రాంతంలో ప్రారంభమైన యాత్రకు అక్కచెల్లెమ్మలు హారతులు పట్టారు. జగనన్న తెచ్చిన వలంటీర్లు, సచివాలయాలతో తమ పనులు సులభతరమైపోయాయని, కార్యాలయాలు చుట్టూ తిరిగే దుస్థితి తప్పిందంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పొద్దున్నే ఇంటికి వచ్చి నిద్రలేపి మరీ పింఛన్ ఇస్తున్నారని, ఇంత మేలు చేసిన జగన్ బాబును చూడాలని వచ్చామని తమ ఆనందాన్ని పంచుకున్నారు.
మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత వాతావరణం చల్లబడింది. సీఎం జగన్ అక్కవరం సభలో ప్రసంగిస్తుండగా మేఘాలు కమ్ముకున్నాయి. సభా ప్రాంగణంలో చినుకులు రాలడం, సమీపంలో వర్షం కురవడంతో హర్షాతిరేకాలు మిన్నంటాయి. జగన్ రాకతో తమ ప్రాంతం చల్లబడిందని, ఆయన అడుగుపెట్టిన చోట మంచే జరుగుతుందని చెప్పడానికి ఇదే నిదర్శనమని మహిళలు నినాదాలు చేశారు.
♦ పుట్టుకతో వినికిడి లోపం కలిగిన తన కుమారుడు త్రిషాన్ రెండు చెవులకు 2022లో ఆరోగ్యశ్రీ ద్వారా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ ఉచితంగా
చేయడంతో చిన్నగా మాట్లాడగలుగుతున్నట్లు శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం నర్సిపురం గ్రామానికి చెందిన చమల్ల శ్రీధర్ సీఎం జగన్ వద్ద ఆనందం వ్యక్తం చేశాడు. అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద ఆయన సీఎం జగన్కు కలిశారు.
♦ ‘మేమంతా సిద్ధం’ యాత్ర మడపాం టోల్గేట్ వద్దకు చేరుకునేసరికి అభిమానులతో కిక్కిరిసిపోయింది. భారీ క్రేన్తో తెచ్చిన నవరత్నాల పథకాల మాలతో సీఎం జగన్కు ఘన స్వాగతం పలికారు. అక్కడ తనను కలసిన ఓ దివ్యాంగుడికి మూడు చక్రాల మోటార్ సైకిల్ అందజేస్తామని సీఎం జగన్ భరోసా వచ్చారు. వినికిడి లోపంతో బాధపడుతున్న ఓ బాధితురాలికి కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్స నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కుటుంబం అంతా జగనన్న అభిమానులం
మా కుటుంబం మొత్తం జగనన్న అభిమానులం. జగనన్న పాదయాత చేసినప్పుడు నేను చదువకుంటున్నా. మా జిల్లాకు వచ్చినప్పుడు సెల్ఫీ కూడా తీసుకున్నా. ఇప్పుడు మా పాప రెండో తరగతి చదువుతోంది. జగనన్నను చూడాలని రాత్రి నుంచి మారాం చేయడంతో ఉదయం 7 గంటలకే అక్కివలస తీసుకొచ్చాం. జగనన్న చేపట్టిన విద్య, వైద్య సంస్కరణలు సామాన్యులకు ఎంతో మేలు చేస్తున్నాయి. వాటిని కళ్లారా చూస్తున్నాం. – పి.సంతోషిమణి, శ్రీకాకుళం
మా తొలి ఓటు జగనన్నకే..
నాన్న అబ్దుల్ సలీమ్ ప్రైవేటు కాలేజీలో పనిచేస్తుండగా అమ్మ నసీమాబేగం గృహిణి. తక్కువ ఆదాయం ఉన్న మాలాంటి కుటుంబాలకు జగనన్న దేవుడు. మా అక్క, నా చదువు పూర్తిగా జగనన్న విద్యా దీవెనతోనే పూర్తయింది. ఇంటి స్థలం ఇచ్చి ఆర్థిక సాయం చేయడంతో సొంతిల్లు కట్టుకున్నాం. మా కుటుంబం ఆనందంగా ఉందంటే అది జగనన్న పుణ్యమే. మా అక్కకు, నాకు తొలిసారి ఓటు వేసే అవకాశం వచ్చింది. తొలి ఓటు ఫ్యానుకే వేస్తాం. జగనన్నను చూశాకే అక్కివలస నుంచి ఇంటికి వెళతా. – నజీమా, విజయనగరం