బెంగళూరు: కర్నాటకలో ఎన్నికల ప్రచారపర్వం ముగిసింది. రేపు(బుధవారం) అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగనుంది. ఇక, ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా జాతీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ప్రచారంలో అధికార బీజేపీపై కాంగ్రెస్ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ సర్కార్ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ స్థానిక, జాతీయ పత్రికల్లో ‘అవినీతి రేటు కార్డు’ అంటూ ప్రకటనలు ఇచ్చింది. దీంతో, ఈ విషయాన్ని బీజేపీ సీరియస్గా తీసుకుంది. దీనికి సంబంధించిన ఆధారాలను చూపించాలని డిమాండ్ చేసింది.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సిద్ద రామయ్య, డీకే శివ కుమార్కు బీజేపీ.. క్రిమినల్ పరువు నష్టం దావా కేసు వేసింది. అయితే, మే 5వ తేదీన పలు దినపత్రికల్లో బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు(40 శాతం కమీషన్ సర్కార్) చేస్తూ కాంగ్రెస్ ప్రకటనలు ఇచ్చింది. అలాగే, బీజేపీ ప్రభుత్వం నాలుగేళ్లలో ప్రజల నుండి రూ. 1,50,000 కోట్లకు పైగా దోచుకుంది అని తెలిపారు. దీనిపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ ప్రకటనను ఉపసంహరించుకోవాలని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీజేపీ.. ముగ్గురు కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ, ప్రకటనలను ఉపసంహరించుకోలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ తాజాగా కాంగ్రెస్ నాయకులపై క్రిమినల్ పరువు నష్టం వేసింది.
ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ ప్రకటనలపై బీజేపీ నేత ఓం పాఠక్.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ప్రకటనలు తమ పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. ఓటర్లను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ఫైరయ్యారు. ఈ ప్రకటనలకు సంబంధించి ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు.
BJP files defamation case against Rahul Gandhi, Shivakumar, Siddaramaiah over 'corruption rate card' ads.
(@nabilajamal_ )#News #Karnataka #ITVideo pic.twitter.com/k4AF0xS2EQ— IndiaToday (@IndiaToday) May 9, 2023
ఇది కూడా చదవండి: మీ బిడ్డను ముఖ్యమంత్రిని చేయండి