AP Assembly Elections 2024: మరో జైత్రయాత్రకు సిద్ధం
Published
Fri, Apr 26 2024 6:10 PM
సాక్షి, గుంటూరు: ఒకవైపు సంక్షేమ పథకాలు, అభివృద్ధి.. మరోవైపు గడప గడపకు మన ప్రభుత్వంతో ప్రజాప్రతినిధుల్ని ప్రజలతో మమేకం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో జైత్రయాత్రకు సిద్ధం అవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే సిద్ధం పేరిట నాలుగు భారీ బహిరంగ సభలు, 22 రోజులపాటు మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ప్రజా మద్దతు వైఎస్సార్సీపీకే ఉందని నిరూపించారాయన. ఎక్కువ విరామం తీసుకోకుండా మరో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారాయన.
తాడిపత్రి నుంచి ప్రచార సభలు ప్రారంభం ఈ నెల 28 నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. తాడిపత్రి నుంచి ప్రచార సభలు ప్రారంభం కానున్నాయి. ప్రతి రోజూ 3 ప్రచార సభల్లో సీఎం జగన్ పాల్గొనున్నారు. 28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు.. 29న చోడవరం, పి.గన్నవరం, పొన్నూరు.. 30న కొండెపి, మైదుకూరు, పీలేరు.. మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో సభలు నిర్వహించనున్నారు. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో.. 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా రోడ్మ్యాప్కు వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు తుది మెరుగులు దిద్దుతున్నట్లు సమాచారం.
ప్రతిరోజూ రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల వారీగా ఒక్కో సభ ఉంటుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఆయా సభల్లో తన పాలనలో జరిగిన అభివృద్ధిని, కుల,మత,వర్గ, జాతి, రాజకీయ బేధాల్లేకుండా అందించిన సంక్షేమ లబ్ధిని వివరిస్తూనే.. మరోవైపు ప్రతిపక్ష కూటమి కుట్రలను ఎండగట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్యలోనే ఆయన వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉంది.