న్యూఢిల్లీ: డ్రామాలు ఆడొద్దంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రియాంకగాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో ఆమె మాట్లాడారు. ‘‘ ప్రజాస్వామ్యానికి దేవాలయమైన పార్లమెంట్ అంటే ఏంటో మాకూ తెలుసు. ఇది డ్రామాలాడే స్థలం కాదు. పట్టిపీడిస్తున్న ప్రజాసమస్యలను పార్లమెంట్ వేదికగా ఎత్తిచూపితే డ్రామా ఎలా అవుతుంది?. పౌరసమస్యలపై చర్చకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడమే అసలైన డ్రామా. ప్రజాస్వామ్యయుత చర్చలకు తావివ్వకపోవడమే నిజమైన డ్రామా.
ప్రజలకు సంబంధించిన అంశాలపై సమా లోచనలు, సంప్రదింపులు జరక్కుండా అడ్డుకోవడమే అసలైన డ్రామా. పెను సమస్యగా మారిన వాయు కాలుష్యంపై మాట్లాడాం. ఆ అంశాన్ని మేం ప్రస్తావించకూడదా?. ఇలాంటి విషయాలపై విస్తృతస్థాయి చర్చ అక్కర్లేదా? దేశరాజధాని వాయుకాలుష్య కోరల్లో చిక్కుకోవడం సిగ్గుచేటు. ఢిల్లీలోని వృద్ధు్దలు కాలుష్యంతో ఇబ్బందిపడుతున్నారు. ఆస్తమాతో బాధపడేవాళ్లు, ఇతర శ్వాససంబంధ సమస్యలు ఉన్న వాళ్లతో ఢిల్లీ ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ఇంత జరుగుతున్నా చర్చించకుండా కూర్చోవాలా?’’ అని ప్రియాంక నిలదీశారు.
‘వెదర్’ వ్యాఖ్యలపై మండిపాటు
శీతాకాలపు ప్రకృతి సోయగాలను ఆస్వాదించండి అంటూ మీడియా ప్రతినిధులతో మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రియాంకాగాంధీ మండిపడ్డారు. ‘‘ వెదర్ను చూసి ఎంజాయ్ చేయండి అని మోదీ ఉచిత సలహాను పడేశారు. కాలుష్యంతో పొగచూరిన ఈ వాతావరణాన్ని ఢిల్లీవాసులు ఆస్వాదించాలా? ఢిల్లీలో జనసమ్మర్థ ప్రాంతాల్లోకి ప్రధాని వస్తేనే అసలెంత కాలుష్యముందో ఆయనకు బోధపడుతుంది’’ అని ప్రియాంక హితబోధ చేశారు.
ఆయనదంతా కపటనాటకం: ఖర్గే
‘‘రక్తికట్టించేలా నాటకాలు వేసేది ప్రధాని మోదీయే. ఆయన కపటనాటక సూత్రధారి. పార్లమెంట్లో విపక్షాలు డ్రామాలు ఆడుతాయనడం ఆయనకే చెల్లింది. ప్రజాసమస్యలపై మాట్లాడాల్సిందిపోయి ప్రధాని నిజమైన డ్రామాలేస్తున్నారు. ఇకనైనా దృష్టిమరల్చే డ్రామాలకు తెరదింపి బీజేపీ వాస్తవిక సమస్యలపై దృష్టిపెట్టాలి. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక అసమానతలు, దేశ వనరుల లూటీతో జనం అవస్థలు పడుతుంటే అధికారంలో ఉన్న నేతలు మాత్రం దురహంకారంతో డ్రామాలాడుతున్నారు’’ అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. ‘‘ ప్రజావశ్యక సమస్యలను విపక్షాలు పార్లమెంట్లో ప్రస్తావించడం ప్రధాని మోదీకి అస్సలు గిట్టదు. పార్లమెంట్ సజావుగా సాగకపోవడానికి మోదీ ధోరణే అసలు కారణం’’ అని జైరాం రమేశ్ అన్నారు.
ఇది కూడా చదవండి: షాకిస్తున్న కేరళ ‘హెచ్ఐవీ’.. నెలకు 100 కొత్త కేసులు