కోల్కతా : రామేశ్వరం కెఫే బాంబు పేలుడు అంశం ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వెస్ట్ బెంగాల్ అధికార పార్టీ తృణముల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ తరుణంలో బీజేపీ చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ పోలీసులు తీవ్రంగా ఖండించారు.
వెస్ట్బెంగాల్లోని
రామేశ్వరం కెఫే బాండు పేలుడు కేసులో ఇద్దరు ప్రధాన నిందితులు ముస్సావిర్ హుస్సెన్ షాజిబ్, సూత్రధారి అబ్దుల్ మతీన్ తాహాను వెస్ట్ బెంగాల్లో ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది.
సురక్షిత స్వర్గధామంగా
అయితే, వెస్ట్ బెంగాల్లో బాంబు బ్లాస్ట్ నిందితుల్ని అదుపులోకి తీసుకోవడంపై బీజేపీ.. అధికార పార్టీ టీఎంసీఎంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ ఐటీ సెల్ కన్వీనర్ అమిత్ మాల్వియా ..‘‘రామేశ్వరం కెఫే పేలుడులో ఇద్దరు ప్రధాన నిందితులు, బాంబర్ ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్, సహచరుడు అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహాను కోల్కతాలో ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. వీరిద్దరూ కర్ణాటకలోని శివమొగ్గలోని ఐఎస్ఐఎస్ సెల్కి చెందిన వారు. దురదృష్టవశాత్తూ మమతా బెనర్జీ హయాంలో పశ్చిమ బెంగాల్ ఉగ్రవాదులకు సురక్షిత స్వర్గధామంగా మారింది’’ అంటూ ట్వీట్ చేశారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల సంగతేంటి
అమిత్ మాల్వియా వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ కూచ్బెహార్ దిన్హటాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరోక్షంగా బీజేపీని టార్గెట్ చేస్తూ.. రామేశ్వరం కేఫె బ్లాస్ట్ కేసులో అరెస్టయిన నిందితులు తమ రాష్ట్రం వారని కాదని, ఇక్కడ తలదాచుకున్నారని సూచించారు. అయినప్పటికీ ఇక్కడ అండర్ గ్రౌండ్లోకి వెళ్లిన ఇద్దరు నిందితుల్ని రెండుగంట్లలోనే అరెస్ట్ చేశారని స్పస్టం చేశారు. పశ్చిమ బెంగాల్లో శాంతి నెలకొంటే బీజేపీ సహించదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన దీదీ బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్లు ఏమైనా సురక్షితంగా ఉన్నాయా అని ప్రశ్నించారు.
పోలీసుల పనితీరు అమోఘం
ఈ సందర్భంగా టీఎంసీ సీనియర్ నేత కునాల్ ఘోష్ బీజేపీ వ్యాఖ్యల్ని ఖంఢించారు. బాంబు బ్లాస్ట్ కేసు నిందితుల్ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రాష్ట్ర పోలీసుల సహకారం వల్లే సాధ్యమైందని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అదే విషయం మీడియాలో వచ్చిందంటూ పునరుద్ఘాటించారు. పశ్చిమ బెంగాల్ పోలీసులు ‘దేశ వ్యతిరేక శక్తులను అణచివేయడంలో దృఢంగా ఉన్నారు’ ఇతర దర్యాప్తు ఏజెన్సీలకు సహకరించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని కొనియాడారు.
Falsehood at its worst!
Contrary to the claims made by @amitmalviya, the fact is that, two suspects in the Rameshwaram Cafe blast case have been arrested from Purba Medinipur in a JOINT operation by the West Bengal Police and the Central Intelligence Agencies. (1/2)— West Bengal Police (@WBPolice) April 12, 2024
పశ్చిమ బెంగాల్ పోలీసులు ఏమన్నారంటే
మరోవైపు అమిత్ మాల్వియా వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ పోలీస్ విభాగం స్పందించింది. ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు పశ్చిమ బెంగాల్ పోలీసులు, కేంద్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారని, ఆ తర్వాత నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు మరో ట్వీట్లో తెలిపారు. పశ్చిమ బెంగాల్ ఎప్పుడూ ఉగ్రవాదులకు సురక్షితమైన స్వర్గధామం కాదు. రాష్ట్ర పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారు అని పోలీసులు ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్లో పేర్కొన్నారు.