సాక్షి, చెన్నై: కిడ్నాప్ కేసులో మద్రాసు హైకోర్టు కన్నెర్ర చేసింది. కేవీ కుప్పం ఎమ్మెల్యే జగన్మూర్తికి తీవ్రంగా అక్షింతలు వేయడమే కాకుండా ఏడీజీపీ జయరామన్ అరెస్టుకు ఆదేశాలు ఇచ్చింది. తిరువళ్లూరు జిల్లా తిరువేలాంగాడు సమీపంలో బాలుడి కిడ్నాప్ వ్యవహారం రచ్చకెక్కిన విషయం తెలిసిందే. పురట్చి భారతం నేత, ఎమ్మెల్యే జగన్మూర్తి ఇంటి వద్ద గత రెండు రోజులుగా ఉత్కంఠ నెలకొంటూ వస్తోంది.
ఈ కేసులో ఆయన ప్రమేయం ఉన్నట్టు భావించిన పోలీసులు అరెస్టు కసరత్తులు విస్తృతంగా చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కేసు విచారణ న్యాయమూర్తి వేల్మురగన్ బెంచ్లో జరిగింది. విచారణ నిమిత్తం హాజరు కావాలని జగన్మూర్తికి ఆదేశాలు ఇవ్వడంతో మధ్యాహ్నం ఆయన కోర్టుకు వచ్చారు.
తెరపైకి ఏడీజీపీ
ఈ కేసు విచారణ సమయంలో సాగిన వాదనలు మరో ట్విస్టుకు దారి తీశాయి. ఈ కేసులో ఏడీజీపీ జయరామన్ ప్రమేయం వెలుగులోకి వచ్చింది. ఆయన హస్తం కూడా ఉందని ప్రభుత్వ తరఫున న్యాయవాదులు కోర్టు ముందు ఉంచడం చర్చకు దారి తీసింది. అదే సమయంలో ఏడీజీపీ జయరామన్కు సంబంధం లేదంటూ జగన్మూర్తి తరఫు న్యాయవాదులు వాదించడం మరింత చర్చకు దారి తీసింది. వాదనల అనంతరం ఈ కిడ్నాప్ వ్యవహారంలో న్యాయమూర్తి వేల్మురుగన్ తీవ్రంగా స్పందించారు.
ఏడీజీపీ జయరామన్ను అరెస్టు చేసి పోలీసు కస్టడీలో ఉంచాలని ఆదేశించారు. బాధ్యత గల పదవిలో ఉన్న ఎమ్మెల్యే అందరికీ ఆదర్శంగా ఉండాలని హితవు పలికారు. అయితే, ఇలాంటి వ్యవహారాల కారణంగా చిక్కులు ఎదుర్కోక తప్పదన్నారు. ఈ కేసు విచారణకు సంపూర్ణ సహకారం అందించాలని, పోలీసులు విచారణకు వెళ్లే సమయంలో మందీ మార్బలంతో వెళ్ల కూడదని, ప్రజలకు ఇబ్బందులు కలుగ కుండా బా«ధ్యతగా వ్యవహరించాలని హెచ్చరించారు. అదే సమయంలో కోర్టు ఆదేశాల మేరకు తిరువేలాంగాడు పోలీసు స్టేషన్కు రాత్రి సమయంలో ఏడీజీపీ జయరామన్ వెళ్లడంతో ఉత్కంఠ నెలకొంది. ఆయన్ను అరెస్టుచేసి తమ కస్టడీలో ఉంచుకునే దిశగా పోలీసులు కసరత్తులు చేశారు.