అస్సాం ప్రభుత్వం వర్సెస్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్య జరుగుతున్న తాజా వివాదం నేపథ్యంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే రంగంలోకి దిగారు. గువాహటిలో రాష్ట్ర పోలీసులతో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో రాహుల్ ఎదుర్కొన్న భద్రత వైఫల్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. రాహుల్ గాంధీతోపాటు భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొంటున్న ఇతరులకు భద్రతా విషయంపై అమిత్ షా జోక్యం చేసుకోవాలనికోరారు.
అస్సాంలో మంగళవారం చోటు చేసుకున్న పలు ఉద్రిక్తతల నేపథ్యంలో రాహుల్ గాంధీపై పోలీసులు కేసు నమోదు చేసిన అనంతరం ఈ పరిణామం జరిగింది. హింసాత్మక ఘటనలు, రెచ్చగొట్టడం, పోలీసులపై దాడి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినందుకు రాహుల్ , కేసీ వేణుగోపాల్, కన్హయ్య కుమార్ సహా ఇతర వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Shri @RahulGandhi and the #BharatJodoNyayYatra has faced serious security issues in Assam in the last few days.
My letter to Home Minister, Shri @AmitShah underlining the same. pic.twitter.com/FHLG5pg5Bz— Mallikarjun Kharge (@kharge) January 24, 2024
అస్సాంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా రాహుల్కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, అనేక భద్రతా లోపాలు వెలుగుచూశాయని కేంద్ర హోంమత్రికి రాసిన లేఖలో ఖర్గే వివరించారు. కాంగ్రెస్ పోస్టర్లను ధ్వంసం చేయడం, కాంగ్రెస్ యాత్రను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడం, రాష్ట్ర పార్టీ చీఫ్ భూపెన్ బోరాపై దాడి చేయడం వంటి విషయాలను ఆయన ప్రస్తావించారు.
చదవండి: తగ్గేదేలే.. రాహుల్ గాంధీపై కేసు నమోదు
వీటన్నింటి విషయాల్లో అస్సాం పోలీసులు బీజేపీ కార్యకర్తలవైపు పక్షాన నిలిచారని ఆరోపించారు. అంతేగాక కాషాయ శ్రేణులకు రాహుల్ కాన్వాయ్ దగ్గరకు రావడానికి అనుమతించారని విమర్శించారు. రాహుల్, ఆయన సిబ్బంది భద్రతకు ప్రమాదం కలిగించారని మండిపడ్డారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పటికీ.. ఈ ఘటనలతో సంబంధం ఉన్న వారెవరినీ పోలీసులు అరెస్టు చేయలేదన్నారు.
న్యాయ యాత్ర కొనసాగుతున్న కొద్దీ రాహుల్కు ప్రమాదం పెరిగే అవకాశం ఉందని, ఇకనైన అమిత్షా జోక్యం చేసుకొని రాహుల్ యాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భద్రత కల్పించేలా అస్సాం ముఖ్యమంత్రి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్లను ఆదేశించాలని కోరారు.
ఇదిలా ఉండగా భారత్ జోడో న్యాయ్ యాత్ర గువాహటి నగరంలోకి యాత్ర ప్రవేశించకుండా అస్సాం పోలీసులు మంగళవారం భారీగా బారికేడ్లను అడ్డుపెట్టారు. కాంగ్రెస్ కార్యకర్తలు బారికేడ్లను తోసుకుని ముందుకు దూసుకెళ్లారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇరు వర్గాల మద్య ఘర్షణ జరిగింది.
చదవండి: ముంబైలో రామ భక్తులపై దాడులు.. నిందితులపై బుల్డోజర్ యాక్షన్