సాక్షి న్యూఢిల్లీ: భారీ వర్షాలతో ఉత్తరభారతం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఎడతెరిపిలేని వానలతో దేశ రాజధాని ఢిల్లీలో జనజీవనం అస్తవ్యస్తమైనది. ఇప్పుడు దేశ వాణిజ్య రాజధాని ముంబై వంతు వచ్చింది. దంచి కొడుతున్న వానలు నగరాన్ని ముంచెత్తుతున్నాయి. నేడు అనగా గురువారం కూడా ముంబైకి భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఈ మేరకు ప్రజలను అప్రమత్తం చేస్తూ ముంబైలోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలోనే నేడు ముంబైలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు సెలవు ప్రకటిస్తున్నట్టు ప్రభుత్వం బుధవారం తెలిపింది.

భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే అధికారు లను అలర్ట్ చేశారు. అవసరమైన అన్ని సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలను ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే ఇతర సముదాయాలను కాస్త ముందుగానే మూసివేయాలని సూచించారు.
#WATCH | Maharashtra: Heavy rain lashes parts of Mumbai.
IMD has issued a 'Red' alert for Palghar, and Raigad districts and an 'Orange' alert for Thane, Mumbai and Ratnagiri today. pic.twitter.com/HR0KUqGCPZ— ANI (@ANI) July 19, 2023
తద్వారా జనం త్వరగా ఇళ్లకు చేరుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు ఎప్పుడు తెరవాలో పరిస్థితులను బట్టి స్థానిక యంత్రాంగం నిర్ణయం తీసుకుంటుందని సీఎం స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా ముంబై తో పాటు పాల్గర్, రాయఘడ్ జిల్లాల్లో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ సూచనతో పాల్గర్, రాయఘడ్ జిల్లాల్లో కూడా నేడు స్కూళ్లకు సెలవు ప్రకటించారు.