ముంబై: మహారాష్ట్రలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి (86) కన్నుమూశారు. రెండు రోజుల క్రితం గుండెపోటుతో ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మనోహర్ తుదిశ్వాస విడిచారు.
వివరాల ప్రకారం.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి మృతిచెందారు. ముంబైలోని పీడీ హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. ఈరోజు మధ్యాహ్నం ముంబైలో మనోహర్ అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా, గత ఏడాది మేలోనూ మెదడులో రక్తస్రావం కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరారు. ఇక, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు గురువారం సాయంత్రమే వైద్యులు తెలిపారు.
#WATCH | Former CM of Maharashtra Manohar Joshi passed away at Hinduja Hospital in Mumbai at around 3 am today. He was admitted here on February 21 after he suffered a cardiac arrest.
Visuals from outside the hospital. pic.twitter.com/yFL7aUkhfo— ANI (@ANI) February 23, 2024
రాజకీయ ప్రస్థానం..
1937 డిసెంబర్ 2న నాంద్వీలో మనోహర్ జోషి జన్మించారు. విద్యాభ్యాసం మొత్తం ముంబైలోనే జరిగింది. తొలినాళ్లలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన మనోహర్ జోషి 1967లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1968-70 మధ్య మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. ఇక, శివసేన పార్టీలో కీలక నేతగా ఎదిగిన మనోహర్ జోషి 1995 నుంచి 1999 మధ్య మహారాష్ట్ర సీఎంగా పనిచేశారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో 2002-2004 మధ్య లోక్సభ స్పీకర్గానూ వ్యవహరించారు. మూడుసార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన తర్వాత 1990లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 1990-91 మధ్య అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో శివసేన తరఫున ముంబై నార్త్-సెంట్రల్ నియోజవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. కాగా, ఆయన సతీమణి అనఘ మనోహర్ జోషి 2020లో మరణించారు. ఆయనకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.