న్యూఢిల్లీ: భారతదేశంలో బలహీనమైన రుతుపవనాలకు కారణమయ్యే ఎల్ నినో ప్రభావం ఖరీఫ్ సీజన్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాలపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, గుజరాత్, రాజస్తాన్, బిహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్రలపైనా తీవ్ర ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో ఎల్ నినో ముప్పు తీవ్రతను తగ్గించడానికి సమన్వయంతో కూడిన చర్యలు చేపట్టాలని మంగళవారం ఆదేశించింది.
ఎల్ నినో ప్రభావం సాపేక్షంగా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న రాష్ట్రాల్లోని సంబంధిత జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ శాఖలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఇతర విభాగాలతో సమన్వయ సమావేశాలను నిర్వహించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ సూచించారు. ఖరీఫ్–2026 ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వర్షపాతం తక్కువగా ఉన్న జిల్లాల్లో ముందస్తు అత్యవసర ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నారు. వర్షపాతం లోటును దృష్టిలో పెట్టుకొని పత్తి, పప్పుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని చెప్పారు. ఈ ఏడాదికి సంబంధించి 12 ఎల్ నినో ప్రభావిత రాష్ట్రాల్లోని 326 జిల్లాలకు అత్యవసర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలియజేశాయి.
ADVERTISEMENT
ADVERTISEMENT