ఢిల్లీ: బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది దోషుల క్షమాభిక్షను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. గుజరాత్ ప్రభుత్వానికి క్షమాభిక్ష ఇచ్చే అధికారం లేదని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ బివి నగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరిస్తూ.. బిల్కిస్ బానో పిటిషన్ విచారణకు అర్హత ఉందని పేర్కొంది. రెండు వారాల్లోగా లొంగిపోయి జైలుకు వెళ్లాలని దోషులను కోరింది. కేసులో 11 మంది దోషులకు క్షమాభిక్ష కల్పించడాన్ని బాధితురాలు సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే.
దోషుల ముందస్తు విడుదలపై ఉత్తర్వులు జారీ చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని ధర్మాసనం పేర్కొంది. అటువంటి ఉత్తర్వులను జారీ చేసే అర్హత మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేసింది. ఎందుకంటే విచారణ మహారాష్ట్రలోనే జరిగిందని గుర్తుచేసింది. "అపరాధికి శిక్ష పడిన రాష్ట్ర (మహారాష్ట్ర) ప్రభుత్వానికే ఉపశమనాన్ని మంజూరు చేయడానికి తగిన అర్హత ఉంటుంది." అని తీర్పు వెలువరించింది.
2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్లో అల్లర్లు జరిగినప్పుడు ఈ అత్యాచార ఘటన చోటుచేసుకుంది. బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. గతేడాది ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం వారిని విడుదల చేసింది.
Bilkis Bano case: Supreme Court quashes remission order of Gujarat government
Read @ANI Story | https://t.co/4K2Lx1nqbE#BilkisBanocase #SupremeCourt #GujaratGovernment pic.twitter.com/bahrsYnBOs— ANI Digital (@ani_digital) January 8, 2024
గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దోషులకు శిక్షను రద్దు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దోషుల్లో ఒకరైన రాధేషామ్ షా న్యాయవాద వృత్తిని కూడా ప్రారంభించాడు. దీనిని బాధితులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఇదీ చదవండి: మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. మాల్దీవుల హైకమిషనర్కు భారత్ సమన్లు