చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత మరణించి ఏడేళ్లు అవుతోంది. నేడు(శనివారం) ఆమె 76వ జయంతి సందర్భంగా ఏఐఏడీఎంకే జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్), పలువురు సీనియర్ నేతలు, కార్యకర్తలు జయలలిత(అమ్మ)కు నివాళులు అర్పించారు. అయితే ఈసారి వినూత్నంగా ‘అమ్మ’ జయంతిని పురస్కరించుకొని.. పార్టీ కేడర్లో ఉత్సాహం నింపడానికి ఏఐఏడీఎంకే సరికొత్తగా ఆలోచించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో తయారుచేసిన ‘అమ్మ’వాయిస్ క్లిప్ను పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ‘అమ్మ’తో ఉన్న అనుబంధాన్ని నేతలు గుర్తు చేసుకున్నారు. ఏఐ వాయిస్ క్లిప్లో అచ్చం ‘అమ్మ’నే పార్టీ నేతలు, కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడినట్టు ఉండటం విశేషం.
ఆ ఏఐ క్లిప్లో దివంగత నేత జయలలిత ప్రసంగం ఇలా ఉంది... ‘హలో.. నేను మీ జయలలితను మాట్లాడుతున్నా. ఈ సాంకేతికతకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎందుకుంటే నేను మీతో మాట్లాడే అవకాశం ఇచ్చింది. మన పార్టీ చాలా ఎత్తుపల్లాలను చూసింది. మనం అధికారంలో ఉన్నో సమయంలో మహిళలు, విద్యార్థులకు అనేక సంక్షేమ పథకలు ప్రవేశపెట్టి అమలు చేశాం.
மாண்புமிகு இதயதெய்வம் புரட்சித்தலைவி அம்மா அவர்களின் 76வது பிறந்தநாள் விழாவினை முன்னிட்டு,
மாண்புமிகு கழக பொதுச்செயலாளர் புரட்சித்தமிழர் @EPSTamilNadu அவர்களின் வழிகாட்டுதலின்படி இன்றைக்கு தகவல் தொழில்நுட்பத்தின் உச்சமாகக் கருதப்படும் செயற்கை நுண்ணறிவு (Artificial Intelligence)… pic.twitter.com/APuSq7u6AW— AIADMK (@AIADMKOfficial) February 24, 2024
...ప్రస్తుతం ఒకవైపు మనకు ద్రోహం చేసే కేంద్ర ప్రభుత్వం ఉంది. మరోవైపు అవినీతితో నిండిపోయిన పనికిరాని రాష్ట్ర ప్రభుత్వం ఉంది. నా పుట్టిన రోజు సందర్భంగా ఒకటి చెబుతున్నా.. మన పార్టీ నేతృత్వంలో ప్రజల ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలి. మన కార్యకర్తలంతా నా మార్గంలో పార్టీ కోసం నడవాలని కోరుతున్నా. పార్టీకి, సోదురుడు ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) మద్దతుగా నిలవాలి. ఈపీఎస్ నాయకత్వాని బలోపేతం చేయాలి. ఎందుకంటే మనం ప్రజల కోసమే ఉన్నాం’ అని జయలలిత స్వయంగా మాట్లాడినట్లు వాయిస్ వచ్చింది.
దీంతో జయలలిత ఏఐ వాయిస్ క్లిప్ విన్న కార్యకర్తలంతా తమ అధినేత్రి జీవించి ఉన్నట్లుగానే అనిపించిందని భావోద్వేగం వ్యక్తం చేశారు. ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) 2022లో ఏఐఏడీఎంకేకు నాయకత్వం వహిస్తున్నారు. పన్నీర్ సెల్వం పార్టీ నుంచి తొలగించబడిన అనంతరం ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) పార్టీ చీఫ్గా కొనసాగుతున్నారు.